హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ బై ఎలక్షన్ నేపథ్యంలో ఆ ప్రాంతాలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రూ. 3వేల కోట్లతో చేపట్టే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 10న నెల్లికల్లు లిఫ్ట్కు శంకుస్థాపన చేసి, హాలియాలో బహిరంగ సభ నిర్వహించి.. ఉప ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. నాగార్జునసాగర్ బైఎలక్షన్తోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్లపైనా చర్చించారు. నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇంకా చేపట్టాల్సిన పలు పనులపై సమీక్షించారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు నీళ్లు అందించేందుకు నెల్లికల్లుతోపాటు మరో ఎనిమిది నుంచి తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందుకు రూ. 3వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు సీఎం నేతలకు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద సాగుకాకుండా మిగిలిపోయిన ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికే కొత్త లిఫ్టులు నిర్మిస్తున్నామన్నారు. వీటన్నింటికీ ఈ నెల 10న మధ్యాహ్నం 12.30కు నెల్లికల్లులో ఒకేచోట శంకుస్థాపన చేస్తానని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతానన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎక్కువ నీళ్లిచ్చే ప్రాజెక్టులపై ఫోకస్
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బడ్జెట్పై సీఎం రివ్యూ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్తో ప్రాజెక్టులు, చీఫ్ ఇంజనీర్ల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. డిపార్ట్మెంట్ రూ.32 వేల కోట్లతో ప్రపోజల్స్ పంపింది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్తోపాటు పాలమూరు – రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్ స్కీం, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఈ యేడు ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులపై ఫోకస్ చేయాలని సీఎం సూచించినట్టు తెలిసింది.
స్కీమ్లకు రూ.1,200 కోట్లు సాంక్షన్
సీఎం ప్రతిపాదించిన లిప్ట్ స్కీమ్లకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డర్స్ జారీ చేసింది. రూ.1217.71కోట్లు నిధులను సాంక్షన్ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ జీవో జారీచేశారు.
సాగర్ లో కచ్చితంగా గెలవాలె
సాగర్ బైఎలక్షన్లో కచ్చితంగా గెలవాలని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు. అందరికీ ఆమోద యోగ్యమైన క్యాండిడేట్ను ఎంపిక చేస్తామని, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా బాధ్యత తీసుకుని పని చేయాలని సూచించారు. ఈ నెల 10న హాలియాలోనే పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ను ప్రారంభిస్తామని, ఎమ్మెల్యేలంతా మెంబర్షిప్ నమోదుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.