హైదరాబాద్, వెలుగు: త్వరలో ఆర్టీసీ సంస్థకు చైర్మన్ ను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. పరిశీలనలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ సమయంలో బాజిరెడ్డి గోవర్దన్కు అవకాశం దక్కలేదు. దీంతో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని ఆయనకు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ముందుగా రైతు సమన్వయ సమితి చైర్మన్ గా బాజిరెడ్డిని నియమిస్తారని చర్చ జరిగినా.. ఆ పదవిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. దీంతో ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్దన్ను నియమించే చాన్స్ ఉందని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి నాయిని నర్మింహారెడ్డి పేరు కూడా ఈ పదవి రేసులో వినిపిస్తోంది.
త్వరలో పూర్తిస్థాయి ఎండీ
ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఐపీఎస్ ను నియమించాలా.. ఐఏ ఎస్ ను నియమించాలనే దానిపై చర్చ జరుగుతోంది. టీఎస్ ఆర్టీసీ ఏర్పాడ్డాక ఐపీఎస్ అధికారిని కాకుండా సంస్థలో అనుభవం ఉన్న ఈడీని ఎండీగా రిక్రూట్ చేశారు. ఆయన తర్వాత ఇన్చార్జి ఎండీగా ఐఏఎస్ అధికారి సునీల్శర్మను నియమించారు. ప్రస్తుతం ఆయనే కొనసాగుతున్నారు.

