బీఆర్ఎస్లో చేరుతమని వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నయ్: కేసీఆర్
సంక్రాంతి తర్వాత ఊహించని స్థాయిలో చేరికలు
నా ఆఫీసు కంటే ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ బిజీ అయితది
బీఆర్ఎస్ పవర్లోకి వస్తే వెలుగు జిలుగుల భారత్
ఏటా 25 లక్షల మందికి దళితబంధు
విశాఖ ఉక్కును కాపాడుతం..
పార్టీలో చేరినోళ్లకు స్వాతంత్ర్య సమరయోధులంత గౌరవం ఉంటది
6.64 లక్షల గ్రామాలు, 1,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ఏపీ నుంచి మహామహులు బీఆర్ఎస్లోకి వస్తామని చెప్తున్నారని, తనకు ఊహకందని స్థాయిలో పార్టీలో చేరుతామని వేలాది ఫోన్లు చేస్తున్నారని పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. తాము చీకట్లో బాణం వేయడంలేదని, ఒక లక్ష్యంతో వెళ్తున్నామని, టార్గెట్ రీచ్ అవుతామని చెప్పారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఏపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ను పార్టీ ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు సహా పలువురు నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఏపీలో సిట్టింగ్లు కూడా వస్తామంటున్నారు. మీరు సిట్టింగ్లే కదా ఎందుకు వస్తారని అడిగితే.. సిట్టింగే అయినా ఇక్కడ (ఏపీలో) ఫిట్టింగ్ సరిగా లేదని అంటున్నారు.. మీరు చూస్తూ ఉండండి.. నా ఆఫీస్ కన్నా ఏపీ ఆఫీస్ బిజీగా ఉంటది.. సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరికలుంటాయి. నాకు ఇప్పుడు ఏపీలో డైమండ్స్, వజ్రాల్లాంటి నేతలు దొరికారు. తమ పీఠాల కిందికి నీళ్లెక్కడ వస్తాయోనని చాలా మంది కూస్తరు. కూసేవాళ్లను పట్టించుకోవద్దు. ఎంతో మంది సన్నాసుల కన్నా తోట చంద్రశేఖర్ లాంటి నేతలు బెటర్. వీళ్లకు అవకాశాలు వస్తే ఎంతో చేస్తారు’’ అని అన్నారు. ఒక ఊరు కోసమో.. రాష్ట్రం కోసమో బీఆర్ఎస్ పుట్టింది కాదని, దేశం కోసం.. కేంద్రాన్ని ప్రశ్నించడానికే పుట్టిందని చెప్పారు. బీఆర్ఎస్లో చేరిన వాళ్లకు దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి దక్కినంత గౌరవం దక్కుతుందని అన్నారు. దళితబంధుతో దర్జాగా బతుకుతున్నరు
దేశంలో బీఆర్ఎస్కు ప్రజలు అధికారం ఇస్తే రెండేండ్లలోనే వెలుగు జిలుగుల భారత్ అవతరిస్తుందని కేసీఆర్ చెప్పారు. ప్రతి రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చినా ఖర్చయ్యేది రూ.1.40 లక్షల కోట్లేనని అన్నారు. దేశంలో ఏటా 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇస్తామని తెలిపారు. తెలంగాణలో దళితబంధుతో దళితబిడ్డలు దర్జాగా కాలుమీద కాలు వేసుకొని బతుకుతున్నారని ఆయన అన్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని మోడీ ప్రభుత్వం ఎందుకు అమ్ముతున్నదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ఇప్పటి ప్రభుత్వం అమ్మినా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకొని పబ్లిక్ సెక్టార్లోనే పెడతామన్నారు. కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణను అడ్డుకోవడానికే బీఆర్ఎస్ పుట్టిందని చెప్పారు. మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, హర్యానా తదితర రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు రెడీ అయ్యాయని, సంక్రాంతి తర్వాత పార్టీ పరుగులు మొదలవుతాయన్నారు. ఒక్క ఏపీ, తెలంగాణలో మార్పుతోనే వచ్చేదేమి లేదని.. దేశాన్ని ఉజ్వలంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. కొందరికి పాలిటిక్స్ అంటే గేమ్ అని, అదే తమకు ఒక్క టాస్క్ అని కేసీఆర్ అన్నారు. ఫ్రంట్లు, టెంట్లు పెట్టి 500 ఎంపీలు గెలిచినా చేసేది ఏముంటుందని ప్రశ్నించారు. లోక్సభలో బిల్లు పాసయితే రాజ్యసభలో ఆగుతుందని అన్నారు. ప్రగతికి ఆటంకం కలిగించే ఇలాంటి విషయాల్లో సంస్కరణలకు అవసరమయ్యే మార్పులు చేసుకోవాలని తెలిపారు. దేశంలోని 6.64 లక్షల గ్రామాలు, 1,123 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
రజకులను ఎస్సీల్లో చేర్చితే వాళ్లేంగావాలె
‘‘తమను ఎస్సీల్లో కలుపాలని రజకులు కోరుతుంటారు. ఎస్సీల్లో కలపడం వల్ల ఉద్యోగం వస్తుందనో, ఇంకేదో ప్రయోజనం చేకూరుతుందనో వాళ్లకు ఆశ ఉంటుంది. ఇది తప్పుకాదు.. కానీ వీళ్లను ఎస్సీల్లో చేర్చితే ఇప్పటికే ఎస్సీల్లో ఉన్నవాళ్లు ఏం కావాలి? అసలు ఏ వనరులు లేని సింగపూర్లో బడ్జెట్ మిగిలి ఉందని ఒక్కొక్కరికి 300 డాలర్లు పంచారు.. మన దగ్గర అలాంటి పరిస్థితి రావాలి” అని కేసీఆర్ అన్నారు. ‘‘బీఆర్ఎస్ అంటే తమాషా కోసమో.. దేశంలో ఒకమూల కోసమో.. ఒక రాష్ట్రం కోసమో కాదు.. బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా. మహాత్మాగాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ తమకెందుకులే అనుకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేది కాదు. దేశం బాగు కోసం అలాంటి అడుగు పడాల్సి ఉంది. ఎవరో ఒక్కరు ఆ బాధ్యత తీసుకోవాలి కాబట్టే నేను తీసుకున్నాను. బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్ఎస్ది నేషలైజేషన్” అని కేసీఆర్ అన్నారు. కాగా, బీఆర్ఎస్లో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, నాయకులు టీజే ప్రకాశ్, రమేశ్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావు కూడా చేరారు.
తెలంగాణలో కలపాలని ఒకటే గోల
‘‘మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలుపాలని ఒకటే గోల చేస్తున్నారు. లేదంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు” అని కేసీఆర్ తెలిపారు. రేపో ఎల్లుండో అధికారంలోకి రావాలనేది బీఆర్ఎస్ సిద్ధాంతం కాదన్నారు. ప్రతి ఎన్నికల్లో పార్టీలు గెలుస్తూ ప్రజలు ఓడిపోతున్నారని, ఇన్నేళ్లయినా మన దేశం చేరుకోవాల్సిన దశకు చేరుకోలేదని పేర్కొన్నారు. ఒక మూలన కూర్చోవడానికి బీఆర్ఎస్ పెట్టలేదని, దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఏర్పాటు చేశామన్నారు. ‘‘పార్టీ ఎందుకు ఏర్పాటు చేశాం.. మన లక్ష్యం ఏమిటి అనే దానిపై రానున్న రోజుల్లో ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. దేశంలో ఏం చేసైనా సరే ఎన్నికల్లో గెలువాలనే లక్ష్యంతో పార్టీలు పని చేస్తున్నాయి. కులాల కుంపట్లు పెట్టి.. మతాల మధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 13 నెలలు ఆందోళన చేసి 750 మందికి పైగా చనిపోయినా కనీసం పట్టించుకోలేదు. ఇదేం పద్ధతి?” అని ప్రశ్నించారు.