- సర్కారుకు ఇది టానిక్
- మరింత ఉత్సాహంతో పనిచేస్తం
- తెల్లారిలేస్తే ప్రెస్మీట్ పెట్టి తిడ్తరా?
- నేను ప్రెస్మీట్ పెట్టక రెండు, మూడు నెలలైంది
- అహంభావం, అహంకారం పనికి రాదని కామెంట్
హైదరాబాద్, వెలుగు:
హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు ఓ అద్భుతమని, ఇది ప్రభుత్వానికి టానిక్గా పనిచేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాల నాయకులు దుర్మార్గమైన ప్రచారం చేశారని, నిందలు వేశారని.. అయినా ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. గురువారం హుజూర్నగర్ ఉప ఎన్నిక రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘ఇది ఆషామాషీగా వేసిన ఓటు కాదు. టీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక సంవత్సరానికి జరిగిన ఉప ఎన్నిక ఇది. ఈ మధ్య చాలా వాదోపవాదాలు, చర్చలు, నీలాపనిందలు, అనుమానాలన్ని కూడా జరుగుతా ఉన్నయ్. ఈ టైంలో వచ్చిన తీర్పుతో ప్రభుత్వం మారేది కాదు, అధికార మార్పిడి జరిగేది లేదు. కానీ డెఫినెట్గా ప్రభుత్వానికి ఇదో టానిక్లా పని చేస్తుంది. ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఇస్తుంది. ప్రతిపక్ష నేతల దుర్మార్గమైన ప్రచారం చేశారు. వాటన్నింటిని పక్కనపెట్టి మా క్యాండిడేట్ 43 వేల మెజార్టీతో గెలిచిండు. గతంలో 7 వేల ఓట్ల తేడాతో కోల్పోయినం. అంటే గతంతో పోల్చితే 50 వేల మంది ఓటర్లు టర్న్ అరౌండ్ అయి టీఆర్ఎస్కు అనుకూలంగా అభిప్రాయం చెప్పారు. హుజూర్నగర్ ప్రజలు ఏయే ఆశలతో టీఆర్ఎస్ ను గెలిపించారో 100 శాతం వారి ఆశలు నెరవేరుస్తం. ఎల్లుండి (శనివారం) సాయంత్రం హుజూర్నగర్లో సభ ఉంటది. అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వస్తా. ఆలోపు కూడా వారి సమస్యలు తెలుసుకొని అక్కడే కొన్ని పరిష్కారాలు అనౌన్స్ చేస్త.
అన్ని రకాలుగ చెప్పినం..
ఎదుటివారిని నిందించడమే రాజకీయం అనుకుంటే కరెక్ట్ కాదు. మీ రాజకీయం, మీ పంథా మార్చుకొమ్మని అసెంబ్లీలోనే చెప్పిన. ఈ రోజు ఒకరు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. రాష్ట్ర పునర్నిర్మాణం జరిగే క్రమంలో మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవడం, రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పడం, ప్రజలను గోల్మాల్ చేయడం మంచిది కాదు. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఏది పడితే అది మాట్లాడితే బూమరాంగ్ అయితదని కూడా చెప్పినం. హుజూర్నగర్లో ఈ రోజు అది రుజువైంది. నిర్మాణాత్మకమైన, సద్విమర్శలు చేస్తే సంతోషం. అంతేగానీ అయింది, కానిది, లేచింది, లేవంది చేస్తున్నరు. కొన్ని పార్టీలకు డిపాజిట్లు పోయినయ్. బీజేపీ వాళ్లు రోజు చేసే అరుపులు, పెడబొబ్బలకు వచ్చిన ఓట్లకు పోలిక చూస్తే నవ్వల్నా.. ఏమనుకోవాలె.
రెండు మూడు నెలల్నుంచి ప్రెస్ దగ్గరికి రాలే..
పొద్దునలేస్తే కేసీఆర్ను తిడితే పెద్దొళ్లమైతం అనుకుం టే కరెక్ట్ కాదు. పొద్దున లేవంగనే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టుడేనా? నేను ప్రెస్ దగ్గరకు రాక 2, 3 నెలలు అవుతోంది. ప్రెస్ కాన్ఫరెన్స్ ఊరికే పెట్టొద్దు. పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో సహనం అవసరం. అహంభావాలు, అహంకారాలు పనికి రావు. మా టీఆర్ఎస్ కేడర్కూ విజ్ఞప్తి చేస్తున్నా.. మనపై బాధ్యత పెరిగింది. మరింత సంస్కారవంతంగా పని చేసే టైమిది.
కాళేశ్వరం దగ్గరపడ్డది..
అగ్రికల్చర్ వాటర్ కూడా తీసుకొస్తున్నం.. కాళేశ్వరం ఆల్ మోస్ట్ దగ్గర పడ్డది. పాలమూరు ఫుల్ ప్లెడ్జ్గా పోతా ఉంది.. సీతారామ అయిపోతా ఉంది. దేవాదుల 90 పర్సెంట్ అయిపోయింది. ఈ నాలుగు కంప్లీట్ అయితే నీటి పారుదల రంగంలో తెలంగాణ బాగుంటది. సంక్షేమరంగం అనితర సాధ్యమైన రీతిలో ఇక్కడ అమలవుతోంది.
అది హరాస్మెంట్
కొన్ని పార్టీలు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసినయి. మా మినిస్టర్లు ప్రచారానికి పోతే ఒక్కోరోజు 14 సార్ల చెక్ చేసిండ్రు. మేం వద్దనలే.. చెక్ చేయాల్సిందే. దానికో పద్ధతి ఉంటది. ఇది హరాస్మెంట్ చేసే పద్ధతి.. చివరికి కేసీఆర్ వచ్చే హెలిక్యాప్టర్ కూడా చెక్ చేయాల్నని కంప్లైంట్ ఇచ్చిన్రు. కేసీఆర్ హెలిక్యాప్టర్ల డబ్బు తీసుకొని పోతడా. వినటానికి కూడా జోక్లా లేదా? ఇంత దుర్మార్గంగ చీప్ ప్రచారం చేయాలని చూస్తె హుజూర్నగర్ ఫలితం లాగానే వస్తది.

