హాలియా: కృష్ణా నీళ్లపై ఆంధ్రావాళ్లు దాదాగిరీ చేస్తున్నారని తెలిపారు సీఎం కేసీఆర్. సోమవారం హాలియా సభలో మాట్లాడిన కేసీఆర్..అక్రమంగా వాళ్లు ప్రాజెక్టులు కట్టడంతో నల్గొండ జిల్లాకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. గోదావరి జలాలను నాగార్జున సాగర్ తీసుకొచ్చేందుకు సర్వే జరుగుతోందని..దీని ద్వారా ఆయకట్టుకు నీటి సమస్య తీరుస్తామన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఢోకా ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. పెద్ద దేవులపల్లి-పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేస్తానని చెప్పారు.
గుర్రం పోడు ప్రాంతంలో ఒక లిఫ్ట్ పెట్టినట్లు అయితే ఐదారు గ్రామాలకు కలిపి 10 వేల ఎకరాలకు నీరు వస్తుందని చెప్పారు. త్వరలోనే గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తాం. దీన్ని కూడా నెల్లికల్ లిఫ్ట్తో పాటు మంజూరు చేస్తామన్నారు. దేవరకొండలో ఐదు లిఫ్ట్లు మంజూరు చేశాం, మిర్యాలగూడలో ఐదు లిఫ్ట్లు, నకిరేకల్లో అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్తో పాటు ఈ జిల్లాకు మొత్తం 15 లిఫ్ట్లు మంజూరు చేయడం జరిగింది. లిఫ్ట్ లన్నింటినీ రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు అందిస్తామన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. ఈ క్రమంలోనే దళితబంధు అమలు చేస్తా అన్నారు. ఆరునూరైనా 12 లక్షల దళిత కుటుంబాలకు దళిత బందు అమలు చేస్తాం అన్నారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు దళితబంధు అందుతుందన్నారు సీఎం కేసీఆర్.