
యాదాద్రి పనుల పురోగతిని పరిశీలించేందుకు మంగళవారం సీఎం కేసీఆర్ యాదగిరి గుట్టకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కంభంతో స్వాగతం పలికారు.తర్వాత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
తర్వాత చినజీయర్ స్వామితో కలిసి పనులను చూస్తారు సీఎం కేసీఆర్. పనులపై YTDA అధికారులు, ఇంజినీర్లు, ఆలయ అర్చకులతో సమావేశమవుతారు. ఫిబ్రవరిలో మహా సుదర్శనయాగం చేయాలని నిర్ణయించడంతో… ఆలోగా కాటేజీల నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటు పూర్తికావాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఆలయ ప్రారంభ తేదీని సీఎం ఖరారు చేసే అకాశాలున్నాయి. పనులు పూర్తయ్యాక… శాస్త్రోక్తంగా పూజలు, యాగాలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రధాన దేవాలయం , గోపురాలు , క్యూలైన్లు , ప్రసాదం కౌంటర్లు, ధ్వజస్థంభం , ఆల్వారు స్వాముల విగ్రహాలు, ద్వార పాలకుల విగ్రహాలు , గర్భగుడి ప్రాంతం, శయన మందిరం, ప్రాకారాలు, హుండీ లెక్కింపు ప్రాంతం, స్వామి వారి పుష్కరిణి, శివాలయం, తెప్పోత్సవం నిర్వహించే చెరువు తదితర నిర్మాణాలను సీఎం పరిశీలిస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం, గుడి అంతర్గత పనులను చూస్తారు.
గుట్టకింది భాగంలో ప్రస్తుతమున్న గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి వీలుగా తీర్చిదిద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఈ చెరువును నింపేందుకు వీలుగా కాలువను నిర్మించారు. చెరువు కింది భాగంలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా కళ్యాణ కట్టలు, నీటి కొలనులు ఏర్పాటు చేశారు. అలాగే బస్టాండ్, ఆటో స్టాండు, పార్కింగ్ , ఫైర్ స్టేషన్, పోలీస్ ఔట్ పోస్టు, అన్నదాన సత్రాలను ఏర్పాటు చేయనున్నారు. బస్వాపూర్ చెరువు ప్రాంతంలో అధునాతన హరిత రెస్టారెంట్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు.
వచ్చే ఫిబ్రవరిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 3 వేల మంది రుత్వికులు, వేద పండితులు మరో 3 వేల మంది సహాయకులు యాగంలో పాల్గొననున్నారు. అయితే మహా సుదర్శన యాగం తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది.