
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- యంగ్ ఇండియా స్కూళ్లు, ఇతర విద్యాసంస్థల అభివృద్ధికి 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నం
- ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించండి
- దీన్ని పెట్టుబడిగా భావించి ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మిహాయింపు ఇవ్వాలని కోరిన సీఎం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో విద్యాభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘విద్యారంగంలో సంస్కరణల కోసం మా ప్రభుత్వం దాదాపు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నిధుల సమీకరణ కోసం ప్రత్యేక కార్పొ రేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వండి. విద్యారంగంపై చేస్తున్న ఈ వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించండి” అని విన్నవించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. మంగళవారం రాష్ట్ర ఎంపీలు, అధికారులతో కలిసి నార్త్ బ్లాక్లోని కార్యాలయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో యంగ్ ఇండియా స్కూళ్లు, ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తెచ్చిన లోన్ల రీస్ట్రక్చర్, ఇతర ఆర్థికపరమైన అంశాలపై చర్చించారు. కాగా, నిర్మలతో సీఎం కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు.
105 యంగ్ ఇండియా స్కూళ్లు..
రాష్ట్రంలో దాదాపు రూ.30 వేల కోట్లతో విద్యారంగ అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్టు కేంద్రమంత్రి నిర్మలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే నాలుగు స్కూళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. మిగతా పాఠశాలలకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి.
ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు ఉంటారు. మొత్తం 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. అత్యాధునిక వసతులు, ల్యాబ్లు, స్టేడియాలతో వీటిని నిర్మిస్తున్నం. ఇందుకు రూ.21 వేల కోట్లు ఖర్చవుతుంది. అలాగే రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, టెక్నికల్ కోర్సుల కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ఆధునిక ల్యాబ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని వెల్లడించారు.
లోన్ల భారం తగ్గించండి..
గత సర్కార్ తెచ్చిన లోన్లను రీస్ట్రక్చర్ చేయాలని కేంద్రమంత్రి నిర్మలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘గత ప్రభుత్వం ఇష్టారీతిన అధిక వడ్డీలకు అప్పులు తెచ్చింది. ఇప్పుడు ఆ వడ్డీలు, లోన్ల రీపేమెంట్ ప్రభుత్వానికి తీవ్రమైన భారంగా మారింది. అందుకే లోన్ల రీస్ట్రక్చరింగ్కు అనుమతించండి” అని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. కాగా, తమ విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని సీఎంవో ప్రకటనలో పేర్కొంది.