
- ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో చూపిన ప్రతిభ
- జాతీయ స్థాయిలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ కైవసం
హైదరాబాద్,వెలుగు: జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీసులను సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో 5 బంగారు,7 వెండి పతకాలను సాధించినందుకు ప్రశంసించారు. శుక్రవారం ట్విట్టర్(ఎక్స్)లో ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ‘ పతకాలు సాధించిన విజేతలకు, డీజీపీ రవిగుప్తా, తెలంగాణ పోలీస్ విభాగానికి శుభాకాంక్షలు’..అని విసెస్ చెప్పారు.
ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా లక్నోలో ఈనెల 12 నుంచి శుక్రవారం వరకు మీట్ జరిగింది. కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ, పోలీస్ ఫొటోగ్రఫీలో అన్ని విభాగాల్లో ఒక్కో గోల్డ్, సిల్వర్ ట్రోఫీ, డాగ్ స్క్వాడ్, యాంటీ స్టాబేజ్ చెక్లో రెండు బంగారు, ఒక వెండి పతకం, పోలీస్ వీడియోగ్రఫీలో ఒక వెండి పతకం సాధించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక వెండి, మూడు కాంస్య పతకాలతో జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.
మూడో స్థానంలో నిలిచిన ఐటీబీపీ సిబ్బందికి ఒక బంగారు, నాలుగు కాంస్య పతకాలు దక్కాయి. ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ సాధించినందుకుగాను ప్రతిష్టాత్మకమైన ‘చార్మినార్’ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.12 ఏండ్ల తర్వాత ఈ ఘనత సాధించడంతో పోలీస్ డిపార్ట్మెంట్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశంసించారు.