- రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు: కిషన్రెడ్డి
- బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే అని విమర్శ
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపులతో ప్రజా తీర్పును కాలరాసేలా కాంగ్రెస్సర్కారు వ్యవహరించడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. పార్టీ మారే ప్రజాప్రతినిధులు ఏ గుర్తుమీద, ఏ జెండామీద గెలిచారో.. వాటికి రాజీనామా చేయాలన్నారు.
ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందుదొందే అని.. ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం చూశామన్నారు.
ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్నారు. దీని కారణంగా.. రాజకీయ నేతల పట్ల ప్రజల్లో అసహ్యం ఏర్పడుతోందన్నారు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావాలంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగాలన్నారు.
పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు పరిష్కరిస్తం
రాష్ట్రంలో పత్తికొనుగోలు విషయంలో.. అవగాహన లోపంతో కొన్ని సమస్యలు తలెత్తాయని, జిన్నింగ్ మిల్లులు సమ్మె చేస్తున్నాయని కిషన్రెడ్డి తెలిపారు. తాజాగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును కలిసి సమస్య పరిష్కారానికి చొరవతీసుకోవాలని కోరామన్నారు. టెక్స్ టైల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ.. ఇతర ఉన్నతాధికారులను పిలిపించుకుని మాట్లాడానని చెప్పారు.
తెలంగాణలోని అన్ని జిన్నింగ్ మిల్స్ ద్వారా పత్తికొనుగోలు చేపట్టాలని జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ కోరుతున్నదని.. దాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఇతర అధికారులు రాష్ట్రానికి వెళ్తున్నారని చెప్పారు. అక్కడ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి.. పత్తి సేకరణలో ఇబ్బందులు పరిష్కరించాలని నిర్ణయించామన్నారు.
సౌదీకి ఉన్నతస్థాయి కమిటీ
మక్కాలో బస్సు ప్రమాదంపై కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలియగానే సౌదీలో ఉన్న భారత దౌత్యవేత్త సుహేల్ అజాజ్ ఖాన్ తో మాట్లాడానని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలోఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ తో మాట్లాడనని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఓ ఉన్నతస్థాయి కమిటీని పంపిస్తున్నట్టు కూడా తెలిపారన్నారు.
