- ఉన్నత స్థాయి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్, వెలుగు : పోలీస్ నియామకాల్లో వివాదస్పదంగా మారిన జీవో నం.46పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జీవో రద్దుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నది. ఈ మేరకు పోలీస్ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి కమిటీతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రంజిత్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
జీవో నం46 పై చర్చించారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహాలు, సూచనలను తీసుకున్నారు.