అసెంబ్లీఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పార్టీలో మార్పు వస్తుందని ఆశించానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ప్రజలు ఛీ కొట్టిన బీఆర్ఎస్ సభ్యుల్లో మార్పు రాలేదన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకుంటే.. ఇప్పుడు కూడా ఒక కుటుంబసభ్యులే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మా పార్టీ.. మా ఇష్టం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం చెల్లదన్నారు.
అందెశ్రీ కవిత్వంతో స్పీచ్ మొదలుపెట్టిన సీఎం.. నిరంకుశతత్వం ఎక్కువ కాలం చెల్లదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు గుర్తు్ంచుకోవాలన్నారు. ఆదర్శవంతమైన పాలనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. అందుకే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టామని చెప్పారు. అనాడు సీఎంను కలవాలంటే మంత్రులకు అవకాశం లేదని, ఈనాడు సామాన్యుడు కూడా సీఎంను కలవచ్చుని చెప్పారు. మేం నిరంకుశ్వంతో పరిపాలించాలని అనుకుంటే ఏ బీఆర్ఎస్ నాయకుడ్ని మాట్లాడనిచ్చే వాళ్లం కాదన్నారు.
అమరుల కుటుంబాలను ఒక్కరోజైనా ప్రగతి భవన్ కు పిలిచి మాట్లాడారా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు సీఎం . వాళ్ల త్యాగంతోనే కదా కేసీఆర్ సీఎం అయిందని చెప్పారు. త్యాగాల కుటుంబాలకు పదవులు లేవుకానీ, కేసీఆర్ కుటుంబానికి మాత్రం అందరికీ పదువులా అని ప్రశ్నించారు. మేం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. సభకు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతుల ఆదాయంలో తెలంగాణ 20 స్థానంలో ఉందన్నారు సీఎం. ఈ విషయాన్ని కేంద్రం రాజ్యసభలో చెప్పిందన్నారు. రైతు చావుకు రూ. 5 లక్షలు వెలకట్టిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. రైతులకు పంటలకు బీమా ఇచ్చి ఉంటే బాగుండేదని తెలిపారు. పదేళ్లలో 8 వేల మంది రైతలు చనిపోయినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు.
మాజీ సీఎం కేసీఆర్ పై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో వరి వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్.. తన ఫామ్ హౌస్ లో మాత్రం 150 ఎకరాల్లో వరి పండించారని చెప్పారు. ప్రైవేటు కంపెనీల మీద కత్తి పెట్టి.. అ వడ్లను క్వింటాలకు రూ. 4 వేల 250కి అమ్మారన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు సిద్దంగా ఉంటే తాను ఇప్పుుడే విచారణకు ఆదేశిస్తానన్నారు సీఎం.