పంట పెట్టుబడికి దన్నుగా రైతు భరోసా .. రైతు భరోసా కార్యక్రమాల్లో కలెక్టర్లు

పంట పెట్టుబడికి దన్నుగా రైతు భరోసా .. రైతు భరోసా కార్యక్రమాల్లో కలెక్టర్లు
  • రైతులతో కలిసి సీఎం వీడియో కాన్ఫరెన్స్​లో భాగం

నిర్మల్/ఆసిఫాబాద్/గుడిహత్నూర్/జైపూర్(భీమారం), వెలుగు: రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టిందని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అన్నారు. హైదరాబాద్​ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ​ద్వారా నిర్వహించిన రైతు భరోసా ప్రసంగాన్ని రైతులతో కలిసి కలెక్టర్లు వీక్షించారు. నిర్మల్ గ్రామీణ మండలంలోని న్యూ పోచంపాడ్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. 

రైతు భరోసా పథకం ద్వారా విత్తనాలు, ఎరువులు, యాంత్రీకరణ పనుల కోసం ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించి రైతులకు మేలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని లక్షా 85 వేల 116 మంది రైతుల ఖాతాల్లో రూ.260.80 కోట్ల నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్ తదితరులు రైతులు పాల్గొన్నారు. 

రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నం

రైతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్​ రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావుతో కలిసి  కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలోని 44 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించామన్నారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను జిల్లాలో యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు.

రైతు భరోసాతో రైతులకు భరోసా

పెట్టుబడి సాయంతో రైతులకు భరోసా లభించిందని ఆదిలాబాద్ కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. గుడిహత్నూర్‌ మండలంలోని సీతాగొంది రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు నేటితో రైతు భరోసా నగదు బదిలీ పూర్తయ్యిందని తెలిపారు. రైతులు రైతు భరోసాని సద్వినియోగం చేసుకోవాలని, అధిక మొత్తంలో పురుగు మందులు వాడొద్దని చూసించారు. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌ స్వామి, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ గుణవంత్, మండల ప్రత్యేక అధికారి సునీత, తహసీల్దార్‌ కవితా రెడ్డి, ఏవో భగత్‌ రమేశ్, రైతులు పాల్గొన్నారు.

పంట సాగులో రైతులకు మెలకువలు 

భీమారంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి కలెక్టర్​ దీపక్​తివారీ హాజరయ్యారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను జిల్లాలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు. రైతు నేస్తం ద్వారా రైతులకు పంట సాగులో మెలకువలు అందిస్తున్నామని, భూసారానికి అనుగుణంగా సాగు చేయాల్సిన పంట వివరాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఏవో కల్పన, ఏవో సుధాకర్, ఏఈవోలు అరుణ్ కుమార్, సాంకేతిక తదితరులు పాల్గొన్నారు.