- సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
- వనపర్తి, నారాయణపేట జిల్లాలో రూ.5 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
మక్తల్/వనపర్తి, వెలుగు: ఒకప్పుడు ‘కౌన్ పూచేగా మక్తల్’ అనే వారని, కానీ, ఇప్పుడు ‘మక్తల్కో సబ్ కుచ్ అయేగా.. సబ్ కుచ్ పూచేగా’ అనే స్థాయిలో ఎదుగుతోందన్నారు. అలాంటి ఈ నియోజకవర్గం నుంచి ‘ప్రజా పాలన విజయోత్సవం’ ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం ఎనుమల రేవంత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆత్మకూరు, మక్తల్ మున్సిపాల్టీల్లో పర్యటించారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరిన ఆయన ముందుగా ఆత్మకూరు చేరుకున్నారు. అక్కడి పీజేపీ క్యాంప్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.15 కోట్లతో ఆత్మకూరు పట్టణ అభివృద్ధి పనులకు, రూ.15 కోట్లతో అమరచింత పట్టణ అభివృద్ధి పనులకు, ఆత్మకూరులో రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బిల్డింగ్కు, ఆత్మకూరు–-గద్వాల మధ్య రూ.122 కోట్లతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం హెలీకాప్టర్లో మక్తల్కు చేరుకున్నారు. అక్కడ సీఎం రూ. 4,500 కోట్లతో చేపట్టనున్న మక్తల్–-కొడంగల్,- నారాయణపేట స్కీమ్ పైప్లైన్ పనులకు, మక్తల్ క్రీడమైదానంలో రూ.25 కోట్లతో కాంప్లెక్స్ నిర్మాణం, రూ.210 కోట్లతో మక్తల్–-నారాయణపేట నాలుగు లేన్ల రోడ్డుకు, రూ.200 కోట్లతో మక్తల్ మండలం గొల్లపల్లి వద్ద 25 ఎకరాల్లో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మక్తల్లోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. జాతర సందర్భంగా సుందరీకరణ చేసిన కోనేరును సందర్శించారు. అక్కడి నుంచి ఆయన కాన్వాయ్గా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరివెళ్లారు.
