సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం భేటీ..

సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం భేటీ..

హైదరాబాద్:  పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డా బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో డిసెంబర్ 26వ తేదీ మంగళవారం సీఎం  రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీ లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..  ప్రజల ఆకాంక్షలను  కాపాడే భాద్యత  కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నాం... కాబట్టి, పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఆయన తెలిపారు.  రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.