- శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా స్టడీ చేయండి
- విజన్ డాక్యుమెంట్, గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ డాక్యుమెంట్లో.. తమ శాఖల పరిధిలోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి, స్టడీ చేయాలని మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నివేదికలను ఈ నెల 2వ తేదీ రాత్రి వరకు సమర్పించాలని సూచించారు. ఆదివారం సెక్రటేరియెట్లో ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్’ డాక్యుమెంట్, ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ నిర్వహణ ఏర్పాట్లపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలసీ డాక్యుమెంట్ తుది రూపకల్పనకు సంబంధించిన పనులను వేగవంతం చేస్తూ.. అధికారులకు షెడ్యూల్ జారీ చేశారు. ‘‘అన్ని శాఖలు సమర్పించిన రిపోర్ట్స్ను డిసెంబర్ 3, 4 తేదీల్లో చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సీఎస్, సీఎం కార్యాలయ అధికారులు పరిశీలించాలి.
అనంతరం అవసరమైన మార్పులు, చేర్పులు చేసి ఫైనల్ రిపోర్ట్ను సిద్ధం చేయాలి. డిసెంబర్ 6 సాయంత్రంలోపు ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్ సిద్ధం కావాలి. ఈ రూపకల్పన ప్రక్రియలో అన్ని విభాగాల అధికారులు పూర్తి సమయం కేటాయించాలి. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు, నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలి” అని ఆదేశించారు.
