- అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
- లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్లో ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం ఆరా తీశారు. ఎంఎంటీఎస్ సర్వీసులపై శానసమండలి హాల్లో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్ల సంఖ్య పెంచడంతో పాటు క్రమం తప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని సీఎం ఆదేశించారు.
ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారన్నారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు.. వసతుల మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమీక్షలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ కె.రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆర్ అండ్ బీ వికాస్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హెచ్యూఎంటీఏ ఎండీ జీవన్ బాబు, దక్షిణ మధ్య రైల్వే డీసీఎం చరణ్ నాయక్ పాల్గొన్నారు.
