గిగ్‌ వర్కర్లకు రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ : రేవంత్ రెడ్డి

గిగ్‌ వర్కర్లకు రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ  ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నాలుగ నెలల క్రితం స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి.. సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్ల కోసం.. ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

శనివారం (డిసెంబర్ 23న) నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటోడ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.  

సామాజిక  రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. 

రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..?

“సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా.. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. గివ్ అండ్ టేక్ పాలసీని పాటించని సంస్థలపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. నాలుగు నెలల క్రితం స్విగ్గి బాయ్ ను కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందాడు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందిస్తారని ఆనాడు చూశాం. కానీ.. ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి.. సీఎం సహాయనిధి నుంచి బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా” అని రేవంత్ రెడ్డి అన్నారు.

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన, గ్రామసభలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అక్కడ ఇచ్చే దరఖాస్తుల్లో వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటోడ్రైవర్లకు సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చు అన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రెటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.