
- క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఉబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్
- ఆందోళన చెందొద్దు.. అండగా ఉంటామని హామీ
- గిగ్ వర్కర్లతో సమావేశమై సమస్యలు తెలుసుకున్న సీఎం
- 4 నెలల కింద కుక్క తరమడంతో బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం
హైదరాబాద్, వెలుగు: ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి గిగ్వర్కర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందించడంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఉబర్ తరహాలో టీహబ్ ద్వారా సర్కార్ యాప్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నాలుగు నెలల కింద ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో మూడో అంతస్తు నుంచి పడి చనిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ వివరాలను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
రాజస్థాన్లో గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం చట్టం చేశారని, దాన్ని స్టడీ చేసి అలాంటి చట్టాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్న రాహుల్ గాంధీ హామీని నిలబెడతామన్నారు. అందుకు విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గిగ్వర్కర్ల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. గిగ్ వర్కర్లు సీఎం వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. అండగా ఉంటామని, సమస్యలను పరిష్కరిస్తామని వారికి సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
ఆటో యూనియన్లకు నెట్వర్క్ ఏర్పాటు: పొన్నం ప్రభాకర్
గిగ్ వర్కర్స్కు ఒక కనెక్టివిటీ ఉండి ఇన్సూరెన్స్ అందేందుకు వీలుగా ఓ యాప్ సర్వీసెస్ను అందుబాటులోకి తీసుకొస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే అన్ని ఆటో యూనియన్ ప్రతినిధులను పిలిచి వారి సమస్యలను తెలుసుకుని ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. శనివారం గిగ్ వర్కర్లతో సమావేశం అనంతరం ఏఐపీసీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి కార్మికుడి సంరక్షణ తమ ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఇతర పార్టీల నేతలు ఆటో యూనియన్ వాళ్లను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు నష్టం జరగకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గత నెల 27న హైదరాబాద్లో గిగ్ వర్కర్లను రాహుల్ గాంధీ కలిశారని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక గిగ్ వర్కర్ల సమస్యలు తెలుసుకుంటానని మాటిచ్చారని ప్రవీణ్ చక్రవర్తి గుర్తు చేశారు. అందులో భాగంగానే సీఎం, మంత్రులు కలిసి గిగ్ వర్కర్లతో సమావేశమయ్యారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లున్నారని, వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి సావధానంగా విన్నారని గిగ్ యూనియన్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ తెలిపారు. అందరి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు.
సంస్థలూ కొంచెం ఆలోచించాలి
గిగ్ వర్కర్లపై సంస్థలు కూడా కొంచెం ఆలోచన చేయాలని, కేవలం లాభాపేక్షే కాకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గివ్ అండ్ టేక్ పాలసీని పాటించని ఎంతపెద్ద సంస్థలపైనైనా చర్యలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ‘‘ఫుడ్ డెలివరీ బాయ్ను 4 నెలల కింద కుక్క తరిమితే అపార్ట్మెంట్ మూడో అంతస్తు నుంచి పడి చనిపోయాడు. అప్పటి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని వేచి చూశా. కానీ, ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిధి నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్న” అని సీఎం రేవంత్ తెలిపారు.
గ్రామసభల్లో వివరాలివ్వండి
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలను నిర్వహిస్తున్నామని, సమస్యలేమైనా ఉంటే అక్కడ దరఖాస్తులు, వివరాలు అందించాలని గిగ్ వర్కర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్, మాన్యువల్ సహా ఎలాగైనా దరఖాస్తులను ఇవ్వొచ్చని చెప్పారు. ప్రతి నాలుగు నెలలకోసారి గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాధు యాష్కీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.