రాములోరి కల్యాణానికి సీఎం ఎందుకు వెళ్లరు.?

రాములోరి కల్యాణానికి సీఎం ఎందుకు వెళ్లరు.?

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి, సీతారాముల వారిపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎందుకు అంత వివక్ష అని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. తరతరాలుగా వస్తున్న శతాబ్దాల సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి పాటించకపోవడం హిందువులను అవమానించడమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015,16 లో రాములవారికి అధికారికంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్..మళ్లీ భద్రాచలం వైపు ముఖం చూపకపోవడం దారుణం.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీ సీతారామ చంద్రుల వారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతోంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇంతటి ప్రాశస్త్యం గల కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం దుర్మార్గం. 

కల్యాణ ఖర్చులు కూడా ఇవ్వని సీఎం

17వ శతాబ్దంలో తానీషా  ప్రవేశపెట్టిన సంప్రదాయానికి తూట్లు పొడుస్తూ ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాములవారికి సమర్పించకుండా హిందూ సమాజాన్ని కెసిఆర్ అవమానిస్తున్నారు. శతాబ్దాల పరంపరలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు రాజుగా ఉన్నా వాళ్లు అధికారిక హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఆ సంప్రదాయాన్ని విస్మరిస్తున్నారు.  ఈ పుష్కర సామ్రాజ్య మహోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించకపోవడం రాములవారిని అవమానించడమే. రాముల వారి భక్తుల ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు తూతూ మంత్రంగా మార్చి 29వ తేదీన కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

కల్యాణం పట్ల ఇంత  వివక్షా?

30వ తేదీన కల్యాణం ఉంటే 29వ తేదీన డబ్బులు కేటాయించడం రాములవారి పట్ల సీఎం నిజాయితీ ఏమిటో తెలుస్తుంది . కల్యాణ మహోత్సవానికి రెండు కోట్ల 25 లక్షలు ఖర్చు అవుతాయని ఆలయ అధికారులు ఫిబ్రవరిలోనే సీఎంఓ కు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ప్రకటించిన కోటి రూపాయలు కూడా కేటాయించారా లేదా అని అనుమానం. మన ఇంట్లో రేపు పెళ్లి ఉంటే, ఈరోజు వస్త్రాలు కుట్టించుకుంటామా..? అసలు కల్యాణానికి ఒకరోజు ముందు కోటి రూపాయల ప్రకటనను ఏమందాం? 

వంద కోట్లు ఏవి?

సీఎం కేసీఆర్ భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ‘డబ్బులు కేటాయించారు.. దర్శనానికి మాత్రంరారు’.  అసలు రాముడంటే, హిందువులంటే ఈ ప్రభుత్వానికి లెక్కే లేదు. రంజాన్ తోఫా.. క్రిస్మస్ తోఫా అంటూ ఇతర మతస్తులకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలకు కూడా లక్ష రూపాయలు కేటాయించలేని దౌర్భాగ్యస్థితి. రాముల వారి కల్యాణానికి సీఎం 2017 నుంచి వెళ్లడంలేదు. కనీసం ఈసారైనా వెళ్తారనుకున్నాం. అది హిందూ వ్యతిరేక ధోరణికి నిదర్శనం. 2016లో ఇచ్చిన హామీ మేరకు భద్రాద్రి రామయ్యకు వందకోట్ల కేటాయింపు ఎప్పుడు చేస్తారో చెప్పాలి. రాములవారి ఆలయ అభివృద్ధికి, సీతారాముల వైభవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది.

హిందువులకు క్షమాపణ చెప్పాలి

పనిగట్టుకొని హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తే విశ్వహిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు. వచ్చే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం. అటు రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామనవమికి నిధులు కేటాయించకపోవడంతో దేవాలయం వాళ్లు టికెట్ల రూపంలో భక్తులపై భారం మోపి డబ్బులు పిండుకుంటున్నారు. అసలు కల్యాణానికి ఎందుకు వెళ్లలేదో  చెప్పాలని.. లేదంటే హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రిని విశ్వహిందూ పరిషత్  డిమాండ్ చేస్తున్నది.
- పగుడాకుల 
బాలస్వామి,
రాష్ట్ర ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్