ష్యూరిటీకి ముందుకొస్తలేరు.. 10 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని రైస్ మిల్లర్లు

ష్యూరిటీకి ముందుకొస్తలేరు..  10 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని రైస్ మిల్లర్లు
  • డిపాజిట్​ అమౌంట్​ తిరిగి రాదేమోనని ముందుకు రాని ఓనర్లు
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో వడ్ల కొనుగోళ్లపై ప్రభావం

మహబూబ్​నగర్​, వెలుగు:కొనుగోలు సెంటర్ల నుంచి సేకరించిన వడ్లను రైస్​ మిల్లులు కస్టమ్​ మిల్లింగ్​ రైస్(సీఎంఆర్)గా ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ, చాలా మిల్లులు సీఎంఆర్​ను పెండింగ్​ పెడుతున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లల్లో నష్టం వాటిల్లతోంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సీఎంఆర్​ కేటాయించాలంటే ఆయా మిల్లులు ముందుగానే కేటాయింపులకు అనుగుణంగా 10 శాతం బ్యాంక్​ గ్యాంరంటీలు ఇవ్వాలని నిబంధన తీసుకొచ్చింది. ఆయా జిల్లాల్లో సాగైన వరి పంటకు అనుగుణంగా రెండు వారాల కింద ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ప్రారంభించింది. కానీ, బ్యాంక్​ గ్యారంటీలు ఇవ్వడానికి మిల్లుల యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో వడ్ల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..

గతంలో ఎలాంటి డీఫాల్ట్​ లేని మిల్లులకు తిరిగి కేటాయించే సీఎంఆర్​కు సంబంధించి 10 శాతం బ్యాంక్​ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డీఫాల్ట్ అయి ఫైన్​ చెల్లించిన మిల్లులకు వారికి కేటాయించే సీఎంఆర్​కు అనుగుణంగా 20 శాతం బ్యాంక్​ గ్యారంటీ, డీఫాల్ట్  అయి ఫైన్​ చెల్లించని మిల్లులకు సీఎంఆర్​కు అనుగుణంగా 25 శాతం బ్యాంక్​ ష్యూరిటీలు తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. కానీ, బ్యాంక్​ ష్యూరిటీలు ఇవ్వడానికి మిల్లుల యజమానులు ముందుకు రావడం లేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో 63 రైస్​ మిల్లులు ఉన్నాయి. వీటిలో గతంలో తీసుకున్న సీఎంఆర్​ను తిరిగి ఇవ్వకపోవడంతో ఆఫీసర్లు 19 మిల్లులను బ్లాక్​ లిస్టులో చేర్చారు.

 వీరికి సీఎంఆర్​ కేటాయింపులు చేయలేదు. మిగిలిన 44 మిల్లులకు సీంఎఆర్​ కేటాయించాల్సి ఉండగా, 30 మిల్లులు ఇప్పటి వరకు బ్యాంక్​ ష్యూరిటీలు ఇవ్వలేదు. కేవలం 14 మిల్లుల నుంచి మాత్రమే ష్యూరిటీలు వచ్చాయి. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో అత్యధికంగా రైస్​ మిల్లులు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఈ జిల్లాలో 173 రైస్​ మిల్లులున్నాయి. ఇందులో గత సీజన్లలో కేటాయించిన సీంఎఆర్​ను తిరిగి ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో 39 మిల్లులను బ్లాక్​ చేయగా, 134 మిల్లులు మిగిలాయి. 

వీటిలో 81 మిల్లులకు మాత్రమే సీఎంఆర్​ కేటాయింపుల అర్హత ఉంది. ఇందులో 49 మంది మిల్లర్లు మాత్రమే ఇప్పటి వరకు బ్యాంక్​ ష్యూరిటీలు అందజేశారు. మహబూబ్​నగర్​ జిల్లాలో 93 మిల్లులున్నాయి. వీటిలో 12 లీజు మిల్లులు ఉన్నాయి. వీటికి సీఎంఆర్​ అర్హత లేదని ఆఫీసర్లు తేల్చారు. మిగిలిన 81 మిల్లుల్లో రెండు మిల్లులను డీఫాల్ట్​ లిస్ట్​లో చేర్చారు. దీంతో 79 మిల్లులకు సీఎంఆర్​ కేటాయింపులు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 56 మంది మాత్రమే 10 శాతం బ్యాంక్​ ష్యూరిటీలు ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో 72 రైస్​ మిల్లులు ఉన్నాయి. 

వీటిలో 31 రైస్​ మిల్లులకు సీఎంఆర్​ అలాట్​ చేయడానికి ఆఫీసర్లు బ్యాంక్​ ష్యూరిటీలు ఇవ్వాలని సూచించారు. ఒక్కో మిల్లుకు రెండు వేల మెట్రిక్​ టన్నుల చొప్పున సీఎంఆర్​ కేటాయించగా, ఒక్కో మిల్లు నుంచి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున బ్యాంక్​ ష్యూరిటీలు తీసుకొని సీఎంఆర్​ అలాట్​ చేశారు. అయితే గతంలో 22 మిల్లులు డీఫాల్ట్​ లిస్ట్​లో ఉండగా, వంద శాతం సీఎంఆర్​ క్లియర్​ చేశారు. కానీ, ఈ మిల్లులపై రూ.4 కోట్లకు పైగా జరిమానా విధించగా, వాటిని ఇంకా క్లియర్​ చేయలేదు. దీంతో ఈ మిల్లులకు సీఎంఆర్​ అలాట్​ చేయలేదు. మరో 11 మిల్లులపై కేసులు నమోదు చేశారు. 

రొటేషన్  పద్ధతిలో సీఎంఆర్..​

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ఆయా మిల్లులకు అలాట్​ చేసిన వడ్లను సీజన్​ ముగిసేలోపు మర ఆడించి బియ్యంగా చేసి ప్రభుత్వానికి అప్పజెప్పాలి. కానీ, ఏ మిల్లులోనూ ఇలా జరగడం లేదని అంటున్నారు. రొటేషన్​ పద్ధతిలో మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్​ అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వానాకాలం సీజన్​లో అలాట్​ చేసిన వడ్లను యాసంగి వడ్ల సీజన్​ ప్రారంభమయ్యే లోపు సీఎంఆర్​గా మార్చి ప్రభుత్వానికి ఇవ్వాలి. అలా కాకుండా మిల్లర్లు ఆ సీజన్​కు అలాట్​ చేసిన వడ్లను బయట మార్కెట్​లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత సీజన్​లో వచ్చే వడ్లను మర ఆడించి ఆ బియ్యాన్ని గత సీజన్​కు సంబంధించిన సీఎంఆర్​గా చూపిస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్​ ఇవ్వడానికి నిర్దేశించిన డెడ్​లైన్​ను తరచూ పొడిగిస్తుండడం మిల్లర్లకు కలిసివస్తోంది. 

దీంతో మిల్లర్లు సీఎంఆర్​ ఇవ్వడంలో పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సంబంధిత శాఖ ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం వనపర్తి జిల్లాలో గత సీజన్​లో 88,287 మెట్రిక్​ టన్నులను మిల్లులకు అలాట్​ చేయగా, ఇప్పటి వరకు 7,612 మెట్రిక్​ టన్నులు మాత్రమే సీఎంఆర్​గా తిరిగి ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో లక్ష మెట్రిక్​ టన్నుల్లో 38 వేల మెట్రిక్​ టన్నులు తిరిగి ఇచ్చారు. నారాయణపేట జిల్లాలో 1.86 లక్షల మెట్రిక్​ టన్నుల్లో 58 శాతం సీంఎఆర్​ పూర్తి చేశారు. అలాగే మహబూబ్​నగర్​ జిల్లాలో 40 వేల మెట్రిక్​ టన్నుల సీఎంఆర్​ పెండింగ్​లో ఉంది.