- జులై 15 తర్వాత బ్లాక్డీల్స్
ముంబై: ఇండిగో ఎయిర్లైన్స్లో తమకున్న వాటాలో 5 నుంచి 8 శాతం దాకా అమ్మాలని కో–ఫౌండర్ రాకేష్ గంగ్వాల్ ఫ్యామిలీ ప్లాన్ చేస్తోంది. ఇండిగో ఎయిర్లైన్స్ను నడిపే పేరెంట్ కంపెనీ ఇంటర్గ్లోబ్ఏవియేషన్ లిమిటెడ్లో ఈ వాటా విలువ రూ. 7,500 కోట్లకు సమానమవుతుంది. వాటా అమ్మకం మీద సీఎన్బీసీ ఆవాజ్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ఇండిగోలో రాకేష్ గంగ్వాల్కు 13.23 శాతం, ఆయన భార్య శోభ గంగ్వాల్కు 2.99 శాతం వాటాలు ఉన్నాయి. వారి ఫ్యామిలీ ట్రస్ట్ చింకెర్పూ ఫ్యామిలీ ట్రస్ట్కు మరో 13.5 శాతం వాటా ఉంది. జులై 15న లాక్ ఇన్ ముగిసిన తర్వాత బ్లాక్ డీల్స్ ద్వారా వాటాలను అమ్మాలనేది గంగ్వాల్ ఫ్యామిలీ ఆలోచనగా సీఎన్బీసీ ఆవాజ్ వెల్లడించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో శోభ 4 శాతం వాటా అమ్మారు. తాజా షేర్ల అమ్మకంపై మాట్లాడేందుకు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, గంగ్వాల్ ఫ్యామిలీ తో మాట్లాడేందుకు రాయిటర్స్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫిబ్రవరి 2022లో కో–ఫౌండర్ రాకేష్ గంగ్వాల్ డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పుకున్నారు. అయిదేళ్ల కాలంలో తన వాటా మొత్తాన్ని తగ్గించుకోనున్నట్లు అప్పుడే ఆయన వెల్లడించారు. 2006 లో రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్లు కలిసి ఇండిగోను ఏర్పాటు చేశారు. 2020 లో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 19 శాతం పెరిగిన ఇండిగో షేర్లు గంగ్వాల్ షేర్ల అమ్మకం వార్తలతో 3.1 శాతం పడ్డాయి.