కూలుతున్న కాళేశ్వరం పంప్​హౌస్ సైడ్ వాల్

కూలుతున్న కాళేశ్వరం పంప్​హౌస్ సైడ్ వాల్
  •     లీకేజీతో నీట మునిగిన 
  •     21వ ప్యాకేజీ పంప్ హౌస్


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సారంగాపూర్ పంప్ హౌస్ సర్జ్ పూల్ టన్నెల్ సైడ్ వాల్ కూలుతోంది. ఇటీవల కురిసిన వర్షానికి సైడ్​వాల్ ​కొంత మేర కొట్టుకుపోయింది. గోదావరి జలాలను సారంగాపూర్ నుంచి 3 దశల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అందించేందుకు గతంలో రాష్ట్ర సర్కారు ప్లాన్​ చేసింది. ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 21వ ప్యాకేజీ కింద ఉమ్మడి జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2012 జూన్ లో అప్పటి ప్రభుత్వం నిర్మాణ పనులను ప్రారంభించింది. ఆ తర్వాత కాళేశ్వరంలో భాగంగా సారంగాపూర్​వద్ద 892 కోట్లతో టీఆర్​ఎస్​ ప్రభుత్వం పంప్​హౌస్ నిర్మిస్తోంది. దాన్ని కలుపుతూ గోదావరి నది పరివాహక ప్రాంతం నవీపేట మండలంలోని బినోల నుంచి సారంగాపూర్​వరకు18 కిలోమీటర్ల మేర ఇప్పటికే టన్నెల్ పూర్తయింది. పంప్​హౌస్​ వద్ద రెండేండ్లుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండు నెలల కిందే రెండు మోటార్లు బిగించారు, మరో మోటార్ బిగించేందుకు పనులు కొనసాగుతుండగా వాన నీటికి పంప్​హౌస్​ మునిగిపోయింది. సారంగాపూర్ ​పంప్​హౌస్​లో సర్జ్ పూల్, పంప్ హౌస్ మధ్య ఉన్న గేట్ల లీకేజీతో పంప్ హౌస్ లోకి నీళ్లు చేరినట్లు తెలుస్తోంది. గేట్లు లీకేజ్​లను గుర్తించడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సారెస్సీ కి ఎగువ ప్రాంతంలో కురుస్తోన్న వర్షాలతో  వరదనీరు భారీగా చేరుతోంది. బ్యాక్​వాటర్​తో ఇప్పటికే రెంజల్, నవీపేట, నందిపేట మెండోర మండలాల్లో పంట పొలాలు నీటమునిగాయి.