- అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీస్కోవాలె
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
జీడిమెట్ల, వెలుగు: సూరారం కట్టమైసమ్మ ఆలయం జాతర నేపథ్యంలో ఆలయం చైర్మన్గా చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రతినిధులు బుధవారం జీడిమెట్ల పీఎస్లో సీఐ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతర సందర్భంగా మన్నె ముత్యాలు అనే వ్యక్తి ఆలయ చైర్మన్ అని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు వేస్తున్నాడన్నారు.
అలాగే కొందరు వ్యక్తులు గుడి పేరు చెప్పుకొని చందాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని సీఐ దృష్టికి తెచ్చారు. ఆలయ కమిటీ పేరును వాడుకుంటూ భక్తుల వద్ద అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న మోసగాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. భక్తులను మోసం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ తెలిపినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.