
భద్రాచలం, వెలుగు: ఏపీలోని వైజాగ్ బీచ్ రోడ్డులోని అయోధ్య మోడల్ ఆలయంలో ఈనెల 29న సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్నామని, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని రూ.3 వేలు టిక్కెట్ధర అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వసూళ్లపై భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆదివారం స్పందించింది. రామాలయం నుంచి ఆస్థాన పండితులెవరూ వైజాగ్ అయోధ్య ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణానికి వెళ్లడం లేదని ప్రకటించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు మోసపోవద్దని సూచించారు.