
లక్ష్మణచాంద, వెలుగు: ప్రజలకు విద్య, వైద్యం, రైతులకు వ్యవసాయ రంగాల్లో నాణ్యమైన సేవలందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. లక్ష్మణచాంద మండలంలో గురువారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు, మందులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్ను సందర్శించి క్లాస్రూంలను పరిశీలించి, మిడ్డే మీల్, టీచర్ల హాజరుపై వివరాలు తెలుసుకున్నారు. వనమహోత్సవంలో భాగంగా స్కూల్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మన మహోత్సవంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలని సూచించారు.
అంగన్వాడీల్లో చిన్నారులకు పోషకాహారం, బొమ్మల పుస్తకాలు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం గ్రోమోర్ ఎరువుల దుకాణంలో నిల్వలు, రిజిస్టర్లు, విక్రయ వివరాలను పరిశీలించారు. ఎరువులు, మందులు నిత్యం అందుబాటులో ఉంచాలని సూచించారు. డీఈవో రామారావు, జిల్లా వైద్యాధికారి రాజేందర్, వ్యవసాయాధికారి అంజి ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి అంబాజీ, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధా రాథోడ్, ఎంఈవో అశోక్ వర్మ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరా సౌర గిరిజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
నిర్మల్, వెలుగు: ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని జిల్లాలో పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తాతో కలిసి రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లో వ్యవసాయ అవసరాల కోసం నీటి వనరుల అభివృద్ధికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి హబిటేషన్కు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.