వనపర్తి, వెలుగు: జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో గుర్తించిన షుగర్ పేషెంట్లకు రేటినో స్కోపీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డీఎంహెచ్వో సాయినాథ్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. వైద్య పరీక్షలను ఈ నెల 14 నుంచి ప్రారంభించి 100 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అవసరం మేరకు ఆఫ్తమాలజిస్టులను నియమించుకొని వైద్య పరీక్షలు చేసేందుకు సమాయత్తం కావాలని చెప్పారు
. నిరుడు జిల్లాలో ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్ల వయస్సు పైబడిన వారందరికీ మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, దాదాపు 20 వేల వ్యాధిగ్రస్తులను గుర్తించామని తెలిపారు. వారందరికీ పరీక్షలు చేసి, కంటి సమస్యలు ఉంటే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించాలన్నారు. అత్యవసరమైతే సరోజినీ దేవి ఐ హాస్పిటల్, ఎల్వీ ప్రసాద్, పుష్పగిరి కంటి ఆస్పత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ రామచంద్రరావు, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాసులు, ఆఫ్తమామాలజీ హెచ్ వోడీ శ్రీధర్ తదితరులున్నారు.
ప్రజావాణికి 50 ఫిర్యాదులు
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆదర్శ్ సురభి 50 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. అడిషనల్కలెక్టర్లు ఖీమ్యానాయక్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
