హైవే నిర్మాణ పనులను అడ్డుకోవద్దు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైవే నిర్మాణ పనులను అడ్డుకోవద్దు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : గ్రీన్ ఫీల్డ్ హైవే కు సంబంధించిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, హైవే నిర్మాణ పనులను అడ్డుకోవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. కలెక్టరేట్ లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణ సమస్యలపై రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద సర్వీస్ రోడ్డు డిమాండ్ ను జాతీయ రహదారుల అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, హైవే వద్ద ఉన్న డ్రెయిన్స్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

భూ సేకరణ సంబంధించి రేట్ ను తన పరిధి మేరకు మంజూరు చేస్తానని, రైతులకు అన్యాయం చేయాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. జాతీయ రహదారి రావడం వల్ల మన భూముల విలువ పెరుగుతుందని వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను రైతులు ధర్నాలతో అడ్డుకోవద్దని కలెక్టర్ కోరారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న 40 కిలోమీటర్ల కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవేకు తప్పనిసరిగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు.

 గతంలో ఇచ్చిన హామీ మేరకు బ్రిడ్జి, సర్వీస్ రోడ్డు ఉండాలని, లేని పక్షంలో రైతులకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పారు. వరదల సమయంలో నీరు పొలాలకు వెళ్లడం వల్ల ఆర్థికంగా రైతులు నష్టపోతారని, వారికి తగిన న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద సర్వీస్ రోడ్డు వేయడంతోపాటు డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా చేయాలన్నారు.  సమావేశంలో నేషనల్ హైవే పీడీ దివ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.