- ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
వీర్నపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం వీర్నపల్లి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలను ఎప్పుడు మొదలు పెట్టారు? ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుందా? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. స్లాబ్ దశలో ఉన్న ఇండ్లను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలన్నారు.
కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ శంకర్, డీఈ ముజఫర్, తహసీల్దార్ ముక్తార్ పాషా, ఎంపీడీవో శ్రీ లేఖ, ఏఈలు పాల్గొన్నారు. అంతకుముందు వీర్నపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపీ, డాక్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ చెక్ చేశారు. అనంతరం ఏఎన్సీ నమోదు, ఎన్సీడీ స్క్రీనింగ్ టెస్టులపై ఆరా తీశారు. వ్యాక్సిన్ గది, ల్యాబ్, ఫార్మసీ, తదితర వాటిని పరిశీలించారు.
