ఆర్మూర్, వెలుగు: భవిత కేంద్రాల్లో పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆర్మూర్ లోని భవిత కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల భవిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, చాక్లెట్లు పంచి పెట్టారు.
యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, డీఈవో పి.అశోక్, ఎంఈవో పింజ రాజగంగారాం తదితరులు ఉన్నారు.
