
నిజామాబాద్/ఆర్మూర్, వెలుగు : కాలి పుండుతో నెలల తరబడి అవస్థపడుతూ ఆర్మూర్ శివారులోని పెర్కిట్ మందిరంలో ఉన్న బుజ్జమ్మ (83)ను 108 అంబులెన్స్ సిబ్బంది ఆర్మూర్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. మానవత్వం లేని డాక్టర్లు నామ్కేవాస్తే కట్టుకట్టి హాస్పిటల్ వరండాలోని రేకుల షెడ్లో పడేశారు.
వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర నాయకుడు వి.ప్రభాకర్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకురావడంతో బుధవారం హాస్పిటల్కు వెళ్లి బుజ్జమ్మ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో వృద్దురాలిని అడ్మిట్ చేసుకొని చికిత్స చేస్తున్నారు. అత్యవసరమైతే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ను మీడియా వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు.