
నస్పూర్, వెలుగు: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్ రాజ్తో కలిసి గూగుల్ మీట్ ద్వారా పంచాయతీరాజ్, మున్సిపల్, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, వైద్య శాఖ వైద్యాధికారులతో రివ్యూ నిర్వహించారు.
దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. జ్వరం బాధితులకు తమ పరిధిలోనే వైద్య సేవలు అందించాలని, రక్త పరీక్ష కిట్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించేలా చూడాలన్నారు. పలు సూచనలు, సలహాలు అందించారు.
రైతులకు విత్తన వినియోగంపై అవగాహన కల్పించాలి
వానాకాలం పంటల సాగులో రైతులకు విత్తన వినియోగంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి కల్పనతో కలిసి కలెక్టరేట్లో మండల వ్యవసాయ అధికారులు, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్లతో రివ్యూ నిర్వహించారు. వానాకాలం పంటల సాగులో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల కొనుగోలు, వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరి, పత్తి విత్తనాల కొరత ఏర్పడే అవకాశముంటే ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. నకిలీ, నిషేధిత విత్తనాలతో కలిగే నష్టాలను వివరించాలన్నారు.