
నస్పూర్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఫీల్డ్కు వెళ్లి, పరిష్కరించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను తరలించే వాహనాల పర్మిట్, ఫిట్నెస్ పత్రాలను తనిఖీ చేయాలని చెప్పారు.
వానాకాలం- సీజన్కు సంబంధించి విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం వచ్చే దరఖాస్తులకు ప్రయారిటీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అంతర్గత దారులు, మురుగు కాలువలు, వన మహోత్సవంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగుపై నివేదిక ఇవ్వాలన్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష
మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలను అడ్డుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలను ర్యాలీలు, విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 26న అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని వారోత్సవాలు, శనివారం నో టు డ్రగ్స్,- సే ఎస్ టు యోగా నినాదంతో యోగా డే నిర్వహించాలని సూచించారు.
డీసీపీ భాస్కర్, జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, అబ్కారీ శాఖ అధికారి నందగోపాల్, జైపూర్, బెల్లంపల్లి ఏసీపీలు వెంకటేశ్వర్లు, రవికుమార్, మానసిక వైద్య నిపుణుడు సునీల్కుమార్ ఉన్నారు.