
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరిత
రాజన్నసిరిసిల్ల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.హరిత కోరారు. బుధవారం ఎన్నికల ప్రవర్తనా నియామవళిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు నిబంధనల ప్రకారం ర్యాలీలు, సభలు, ప్రచారాలు నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రెండు, మూడో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో హెల్ప్ లైన్, ఫిర్యాదుల కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షర్ఫుద్దీన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.