ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్​ కలెక్టరేట్​లో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.  ప్రజావాణికి 50 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిలో ధరణి 23, డబుల్​ బెడ్​రూమ్​2, రుణమాఫీ -2, ఇతర సమస్యలు 23 ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మెదక్ మండలం రాజ్​పల్లిలో రెవెన్యూ అవగాహన సదస్సును సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

దరఖాస్తులను తీసుకొని వారికి రశీదులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్​లక్ష్మణ్​ బాబు ఉన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 18 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం85 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు నోడల్ జిల్లాగా మెదక్ ఎంపికైందన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ నగేశ్ , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో​ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

సంగారెడ్డి టౌన్ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వాటిలో రెవెన్యూ 15, సివిల్ సప్లై 4, సర్వే ల్యాండ్ 5,  పంచాయతీరాజ్ 8, పెన్షన్స్ 7, మున్సిపల్ 4 , విద్యాశాఖ 2, మత్స్యశాఖ 5, వైద్య ఆరోగ్యం 2, ఇతర సమస్యలు 9 మొత్తం ఉన్నట్లు వెల్లడించారు. కలెక్టర్, అడిషనల్​కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, డీఆర్​వో పద్మజా రాణి, జిల్లా అధికారులు  కలిసి అర్జీలను స్వీకరించారు. .

అనంతరం మహిళా సమైక్య ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ నిర్వహణ తీరును పరిశీలించారు.బంకు నిర్మాణం పూర్తయిందని మొత్తం 14 మంది మహిళల పనిచేస్తున్నారని తెలిపారు. త్వరలోనే పెట్రోల్ బంకుకు సెక్యూరిటీని నియమిస్తామన్నారు. అనంతరం వాహనంలో డీజిల్ పోయించుకొని డబ్బులను ఇచ్చారు. ఆమె వెంట డీఆర్డీవో పీడీ జ్యోతి, జంగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సిద్దిపేట టౌన్: సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్​అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్లు కలిపి మొత్తం 88 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో డ్వాక్రా గ్రూప్ లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు జేరిపోతుల జనార్ధన్ వినతిపత్రం అందజేశారు. 

సిద్దిపేట పట్టణంలోని గుండ్ల చెరువు డబుల్ బెడ్ రూం ఇండ్లలో 189 బ్లాక్ లో కొనసాగుతున్న ఎంపీపీ ఎస్ స్కూల్ క్లాస్ రూం ల తాళాలను  కొంతమంది తీసి వారి తాళాలు వేసుకున్నారని వెంటనే ఆ రూమ్స్​ను స్కూల్ కు అప్పగించాలని కోరుతూ స్టూడెంట్స్ తల్లిదండ్రులు అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. డీఆర్​వో నాగరాజమ్మ,  జిల్లా అధికారులు పాల్గొన్నారు.