సీ- విజిల్ యాప్​లో ఫిర్యాదు చేయాలి: రాజర్షి షా

సీ- విజిల్ యాప్​లో ఫిర్యాదు చేయాలి:  రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు: తమ దృష్టికి వచ్చిన  ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్​లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదివారం యువతకి సీ-విజిల్ యాప్​పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎవరైనా నగదు, మద్యం, పంపిణీ చేస్తే ఫొటోలు,  వీడియోలను తీసి సీ– విజిల్ యాప్ ద్వారా పంపాలన్నారు. దీనిపై 100 నిమిషాల్లో అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.  లైవ్ ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు, అప్​లోడ్​ చేసే సమయంలో జీపీఎస్​ ఆన్​లో  ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిక్​గా లోకేషన్ నమోదు అవుతుందని పేర్కొన్నారు.  ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్​నెంబర్లను  గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. 

ర్యాండమైజేషన్​ ద్వారా పోలింగ్​ సిబ్బంది కేటాయింపు

మెదక్​, నర్సాపూర్​ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్​ సిబ్బంది కేటాయింపు ర్యాండమైజేషన్​ ప్రక్రియ ద్వారా చేపట్టినట్లు కలెక్టర్​ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.  ఈ నెల 30, 31వ తేదీల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్​,  నర్సాపూర్​లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్​లలో మాస్టర్ ట్రైనర్లతో  ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.