వడ్ల కొనుగోళ్లలో రూల్స్ ఉల్లంఘిస్తే మిల్లుల డిపాజిట్ జప్తు :  కలెక్టర్ సందీప్కుమార్ ఝా 

వడ్ల కొనుగోళ్లలో రూల్స్ ఉల్లంఘిస్తే మిల్లుల డిపాజిట్ జప్తు :  కలెక్టర్ సందీప్కుమార్ ఝా 

జనగామ, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో రూల్స్​కు విరుద్ధంగా వ్యహరిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా హెచ్చరించారు. 'రైస్​ మిల్లులకు నోటీసులు' శీర్షికతో వెలుగులో వచ్చిన వార్తకు స్పందించిన ఆయన ప్రెస్​నోట్​ రిలీజ్ చేశారు. నాణ్యతను సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని ఆయన మిల్లర్లకు సూచించారు. తూకం ఎక్కువ, లారీల అన్​లోడింగ్​ సరైన సమయంలో చేయకుంటే బ్యాంకు గ్యారెంటీలను జప్తు చేస్తామని తెలిపారు.

సీఎంఆర్​ కేటాయింపులు కూడా రద్దు చేస్తామని చెప్పారు. అవసరమైతే మిల్లులను కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇదిలాఉండగా,  జనగామ కలెక్టరేట్​ స్థలంలో ఏర్పాటైన టీ స్టాల్​ తొలగింపును హైకోర్టు సమర్ధించిందని కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా తెలిపారు. భూ కేటాయింపులు లేకుండా ఏర్పాటు చేసినందున ఆక్రమణ కిందకే వస్తుందని హైకోర్టు తెలిపిందన్నారు. ఈ స్టాల్​కు వెజ్​, నాన్​వెజ్​ మార్కెట్​ సమీపంలో తాత్కాలిక లైసెన్స్​తో కేటాయించాలని ఆదేశించిందని తెలిపారు. అపరిచిత వ్యక్తులు కలెక్టరేట్​కు వస్తూ ఆఫీసుల్లోకి వెళ్లి జోక్యం చేసుకుంటున్నందున కలెక్టరేట్​లోనికి 'ఎంట్రీ, ఎగ్జిట్​ ప్రొటోకాల్​' అమలు చేస్తున్నామని చెప్పారు.