
ఆసిఫాబాద్, వెలుగు: ఆకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. గురువారం రెబ్బెన మండలం ఎడవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ డేవిడ్తో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. తేమ శాతం తక్కువగా ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని, తీసుకొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.