
బొగోటా: పాకిస్తాన్లో ఉగ్రవాదుల మృతికి సంతాపం తెలియజేస్తూ ఇచ్చిన ప్రకటనను కొలంబియా వెనక్కి తీసుకుంది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించింది. పాక్పై దౌత్య యుద్ధంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని కమిటీ కొలంబియాలో పర్యటిస్తున్నది. ఈ క్రమంలో కొలంబియా తీరుపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉగ్రవాదులు చనిపోతే సంతాపం తెలుపుతరా? అని నిలదీసింది.
ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచిపోషిస్తున్నదని, తాము దశాబ్దాలుగా ఉగ్రవాదంపై పోరాడుతున్నామని కమిటీ వివరించింది. దీంతో తమ స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్టు కొలంబియా సర్కార్ ప్రకటించింది. ‘‘కొలంబియా విదేశాంగ శాఖ వైస్ మినిస్టర్ రోసా యోలాండా విలావిసెన్సియోతో ఈరోజు మంచి మీటింగ్ జరిగింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోతే..
ఆ దేశానికి సంతాపం తెలియజేస్తూ కొలంబియా సర్కార్ ఇచ్చిన ప్రకటనపై నా అసంతృప్తిని తెలియజేశాను. దీనిపై రోసా వెంటనే స్పందించారు. ఆ స్టేట్మెంట్ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు” అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో శశిథరూర్ శనివారం పోస్టు పెట్టారు.