
గ్లోబల్ సప్లై చెయిన్లో ఇండియా కీలకం
సీఐఐ సదరన్ రీజియన్ ప్రెసిడెంట్ సతీశ్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్తో పాటు ఇతర ఫార్మా ప్రొడక్టుల తయారీ, గ్లోబల్ సప్లైలో ఇండియా కీలక పాత్ర పోషిస్తోందని, అయితే మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇంకా బలపడాల్సి ఉందని సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ సతీశ్ రెడ్డిఅన్నారు. ఇండియా ఇది వరకే వ్యాక్సిన్ హబ్గా ఎదిగిందని, ప్రపంచవ్యాప్తంగా వినియోగమయ్యే వాటిలో 60 శాతం వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్,
బయోలాజికల్ ఇవాన్స్ వంటివి స్ట్రాటెజిక్ పార్ట్నర్ట్ షిప్స్ను కుదుర్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ కూడా అయిన ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ఫార్మా ప్రొడక్టులను మనదేశంలోనే తయారు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. మందుల తయారీకి అవసరమయ్యే యాక్వ్టి ఫార్మా ఇంగ్రీడియెంట్లను (ఏపీఐ) కూడా మనదేశంలోనే తయారు చేసేందుకు ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ఏపీఐ మాన్యుఫ్యాక్చరింగ్ విషయంలో మనం చైనాను అధిగమించగలమా ? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. మనదేశంలో తయారీని పెంచితే మాన్యుఫ్యాకర్చింగ్, సప్లై చెయిన్లో ఇండియాది పైచేయి అవుతుంది’’ అని సతీశ్ రెడ్డి వివరించారు.
కరోనాతో కష్టాలు వచ్చినా
కరోనా ఇండియా ఎకానమీని తీవ్రంగా దెబ్బతీసిందని, అయితే దీనిని గాడిన పెట్టడానికి మోడీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ప్రశంసించారు. ప్యాకేజీలు, ఇన్సెంటివ్లు ప్రకటించడం వల్లకొత్త ఇన్వెస్ట్ మెంట్లు రావడానికి అవకాశాలు పెరిగాయని చెప్పారు. డొమెస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ ను బలోపేతం చేయడానికి దక్షిణాది రాష్ట్రాలు కష్టపడుతున్నాయని చెప్పారు. ఇందుకోసం కొత్త ఇండ స్ట్రియల్ విధానాలను అమలు చేస్తున్నాయని తెలియజేశారు. దీనివల్ల చాలా ఇన్వెస్ట్ మెంట్లను ఆకర్షించవచ్చని సతీశ్ రెడ్డి వివరించారు.
టూరిజం, ఏవియేషన్ వంటి సెక్టార్లు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అయినా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి సెక్టార్లు కోలుకుంటున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు తొలగి, అందరికీ డెవలప్మెంట్ అందేలా చూసేందుకు సీఐఐ ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు. చిన్న పరిశ్రమలను వీలైనంత ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.‘‘గ్లోబల్ జీడీపీలో అమెరికా, చైనా వాటా 40 శాతం వరకు ఉంది. ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ మరింత బలపడితే ఎకానమీలో దీని వాటా 16 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది”అని సతీశ్ రెడ్డి వివరించారు.