హైదరాబాద్ పంజాగుట్ట లో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్య కేసుపై సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. పాత కక్షలే పంజాగుట్ట హత్యకు కారణమని చెప్పారు. మూడు నెలల కిందట అన్వర్ అనే ఆటోడ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రియసత్ అలీ ఆదివారం ఉదయం హత్య కాబడ్డాడని తెలిపారు. మార్నింగ్ వాక్కు వచ్చిన ఆలీని కొందరు వ్యక్తులు కత్తులతో వెంటాడి, హత్య చేసి, అక్కడి నుండి పరారయ్యారని చెప్పారు. పరారైన వ్యక్తుల్లో ముగ్గర్ని పట్టుకున్నామని చెప్పారు. మరో ఇద్దరు నిందితుల ఆచూకీ ఇంకా దొరకలేదని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు.
ఆటోడ్రైవర్ అన్వర్ స్నేహితులే ఈ హత్య చేశారని , మొత్తం అయిదుగురిలో ముగ్గర్ని అరెస్ట్ చేశామని చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ అజర్, అబ్దుల్ అలీం ఉన్నారు. వారి నుంచి కత్తులు, కారు, బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్వర్ హత్య కేసులో ఏ1గా ఉన్న రియసత్ అలీ హత్య… పాత కక్షల కారణంగానే జరిగిందని పోలీసులు తేల్చారు.