- ‘ప్లే టూ ఎర్న్’ గేమ్స్ తేవడంపై దృష్టి పెడుతున్న కంపెనీలు
- గేమ్లో ఎన్ఎఫ్టీ, క్రిప్టో వంటి డిజిటల్ అసెట్లను సంపాదించుకునే అవకాశం
- ఎంటర్టైన్మెంట్, సంపాదన..రెండూ గేమర్ల సొంతం
బిజినెస్ డెస్క్, వెలుగు: ‘గేమ్స్ ఆడి టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావు’ అనే వారే భవిష్యత్లో ‘గేమ్స్ ఆడైనా సంపాదించు’ అని చెబుతారేమో! గేమింగ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ స్టార్టయ్యింది. గేమ్స్ ఆడడంతో సంపాదించుకునే అవకాశాన్ని డెవలపర్లు అందించడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్చువల్ రియాల్టీ, ఏఐ, క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టీ, మెటావర్స్ వంటి కొత్త టెక్నాలజీలు విస్తరిస్తున్నాయి. దీంతో డిజిటల్ అసెట్లకు కూడా వాల్యూ పెరుగుతోంది. ఈ డిజిటల్ అసెట్లను గేమ్స్ ఆడడం ద్వారా సంపాదించుకోవచ్చని గేమింగ్ కంపెనీలు చెబుతున్నాయి. ‘ప్లే టూ ఎర్న్’ గేమ్స్ ఇప్పటికే యూరప్లోని కొన్ని దేశాల్లో లాంచ్ అవుతున్నాయి. ఇండియాలోనూ 7సీస్ ఎంటర్టైన్మెంట్ వంటి కంపెనీలు ఇటువంటి టైప్ గేమ్స్ తీసుకొస్తామని ప్రకటించాయి.
గేమ్స్తో ఎలా..?
గేమ్ఫై టెక్నాలజీ బ్లాక్ చెయిన్ ప్లాట్ఫామ్ను, గేమ్స్ను కలుపుతున్న విషయం తెలిసిందే. దీంతో క్రిప్టోలు, ఎన్ఎఫ్టీలు, డెఫీలు వంటి యునిక్ డిజిటల్ అసెట్లను తమ గేమ్స్లలో డెవలపర్లు ఉంచుతున్నారు. అంటే ట్రెజర్ హంటింగ్ గేమ్ ఆడుతుంటే ప్లేయర్ ఈ డిజిటల్ కాయిన్లను సంపాదించుకునే వీలుంటుంది. తర్వాత ఈ కాయిన్లను ఇతర అసెట్ల కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. తాజాగా గేమ్ డెవలపింగ్ కంపెనీ యూబిసాఫ్ట్ ప్లే టూ ఎర్న్ గేమ్ ‘ఘోస్ట్ రికాన్ బ్రేక్పాయింట్’ను తీసుకొస్తామని ప్రకటించింది. ఈ గేమ్ కోసం క్వార్ట్జ్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేస్తామని, ఈ వీడియో గేమ్ను ఆడడం ద్వారా ఎన్ఎఫ్టీలను కలెక్ట్ చేసుకునే అవకాశం ప్లేయర్లకు ఉంటుందని పేర్కొంది. కొనామి, ఈఏ స్పోర్ట్స్, స్క్వేర్ ఎనిక్స్, స్కై మావిస్ వంటి విదేశీ గేమింగ్ కంపెనీలు కూడా ప్లే టూ ఎర్న్ గేమ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ప్రస్తుతానికైతే పీసీకి సపోర్ట్ చేసే విధంగా ఇటువంటి గేమ్లను తీసుకొస్తున్నారు. భవిష్యత్లో అండ్రాయిడ్, యాపిల్ స్టోర్లలో కూడా వీటిని చూసే అవకాశం ఉంది.
ప్లే టూ ఎర్న్ గేమ్లు పెరుగుతాయ్..
వచ్చే ఐదేళ్లలో ప్లే టూ ఎర్న్ గేమ్లు భారీగా పెరుగుతాయని అంచనా. మొత్తం గేమింగ్ మార్కెట్లో ఇటువంటి గేమ్ల వాటా 90 శాతానికి చేరుకుంటుందని రెడిట్ ఫౌండర్ అలెక్సిస్ అన్నారు. గేమ్స్ ఆడే టైమ్కు ఎటువంటి వాల్యూ లేకపోతే ఇటువంటి గేమ్స్ ఆడడం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ ఇంకో ఐదేళ్లలో నీ టైమ్కు నిజంగానే వాల్యూ ఇస్తావు. నీకు సొంతం కాని కత్తుల (గేమ్లోనివి) కోసం డబ్బులు వేస్ట్ చేయవు. యాడ్స్కు టైమ్ వేస్ట్ చేయవు. ఇలాగే ఉండే ప్లే టూ ఎర్న్ గేమ్లను ఆడడానికి ప్లేయర్లు ఆసక్తి చూపిస్తారు. ఈ గేమ్లను ఎంజాయ్ చేయడమే కాదు వీటిని ఆడడం ద్వారా సంపాదించవచ్చు కూడా’ అని పేర్కొన్నారు.
దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ..
దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోంది. కరోనా సంక్షోభం వలన గేమ్లకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. అందుకే కొత్త కొత్త గేమింగ్ మోడల్స్ను కంపెనీలు తీసుకొస్తున్నాయి. గేమ్ టోర్నమెంట్లు నిర్వహించడం వంటివి చేస్తున్నాయి. కంపెనీలు కొత్తగా ప్లే టూ ఎర్న్ గేమ్ల వైపు కూడా చూస్తున్నాయి. ప్లే టూ ఎర్న్ ఆకర్షణీయమైన మోడల్ అని, దీనిపై ఫోకస్ చేస్తున్నామని హైదరాబాద్ కంపెనీ 7సీస్ ఎంటర్టైన్మెంట్ ప్రకటించింది. ఇటువంటి గేమ్స్ వలన ప్లేయర్లు, కంపెనీలు లాభపడతాయని పేర్కొంది. త్వరలో ప్లే టూ ఎర్న్ గేమ్లను లాంచ్ చేస్తామని తెలిపింది. దేశంలో గేమ్స్ ఆడడం బాగా పెరిగిందని, మిలీనియల్స్ వారానికి సగటున 8.5 గంటల టైమ్ను గేమ్స్ కోసం కేటాయిస్తున్నారని ఈ కంపెనీ అంచనావేసింది. ‘ట్రెజరీ కింగ్’ వంటి గేమ్స్ను ఇటువంటి మోడల్లో తీసుకొస్తామని ప్రకటించింది. కంపెనీ మెటావర్స్ గేమ్స్ను కూడా డెవలప్ చేస్తోంది. ఏఆర్, వీఆర్, మెటావర్స్ వంటి కొత్త టెక్నాలజీల వలన గేమ్లలో కొత్త తరహా మానిటైజేషన్ విధానాలను అమల్లోకి వస్తున్నాయి. కాగా, కేపీఎంజీ రిపోర్ట్ ప్రకారం, దేశంలో గేమింగ్ మార్కెట్ వాల్యూ 2025 నాటికి రూ. 29,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇదే టైమ్లో దేశంలో గేమర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. మొబైల్ గేమ్స్ ఇండస్ట్రీలో గ్రోత్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 5జీ, ఏఐ, ఏఆర్, వీఆర్, మెటావర్స్, బ్లాక్ చెయిన్ వంటి కొత్త తరం టెక్నాలజీలతో గేమింగ్ ఇండస్ట్రీ మరింత వృద్ధి చెందుతుంది. మా గేమ్లను ఆడడం ద్వారా సంపాదించిన డిజిటల్ అసెట్లు ప్లేయర్ల చేతికి వెళతాయి. అమ్ముకోవడంతో సహా వీటిని ఏదైనా చేసుకునే వీలు ప్లేయర్లకు ఉంటుంది . మరిన్ని గేమ్లను తీసుకొచ్చి గేమింగ్ ఇండస్ట్రీలో ఎదగాలని టార్గెట్గా పెట్టుకున్నాం
‑ ఎల్ మారుతి శంకర్, 7సీస్ ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్