
- ఇండిపెండెంట్ డైరెక్టర్లకు కేంద్రం కొత్త రూల్స్
- అవినీతిని తరిమేలా కొత్తో ళ్లకు అపాయింట్ మెంట్ ఎగ్జామ్
- రెండు నెలల్లో మొదలయ్యే చాన్స్
దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు నష్టాల్లో కూరుకుపోవడం చూశాక ఈ నిర్ణయానికి వచ్చింది. ఇక నుంచి కంపెనీల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్ల నియామకానికి ముందు అపాయింట్మెంట్ పరీక్షలు రాసేలా మార్పులు చేయబోతోంది. ఇండియన్ కంపెనీ చట్టాలు, నైతిక విలువలు, క్యాపిటల్ మార్కెట్ నిబంధనలపై ఆన్లైన్లో పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇచ్చిన టైంలో ఎగ్జామ్ను పాసవ్వాల్సి ఉంటుందని, ఆ టైంలోపు పరీక్షను ఎన్నిసార్లయినా రాయొచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖలో ముఖ్య అధికారి ఇంజెటి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారికి ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఉంటుందని, అయితే ప్రభుత్వం రూపొందిస్తున్న డేటాబేస్లో వీళ్లు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. మరో రెండు నెలల్లో ఈ ఎగ్జామ్ను మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా సర్కారు ఈ చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
నష్టాల్లో కంపెనీలు
ప్రస్తుత కంపెనీ చట్టం ప్రకారం ఇండియాలోని లిస్టెడ్ కంపెనీల్లోని బోర్డు సంఖ్యలో మూడో వంతు ఇండిపెండెంట్ డైరెక్టర్లుండాలి. వీళ్లు కంపెనీలోని మైనార్టీ షేర్ హోల్డర్లకు అండగా ఉంటారు. బయటి నుంచి కంపెనీని ఎవరైనా ప్రభావితం చేస్తున్నారో తెలుసుకుంటుంటారు. అయితే తాజాగా కొన్ని బ్యాంకులు, కంపెనీలు సరిగా పని చేయడం లేదని, ఆడిటింగ్ సరిగా ఉండటం లేదని ఆరోపణలొచ్చాయి. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ రూ.83 వేల కోట్ల నష్టాలతో దివాలా తీయడం, పంజాబ్ నేషనల్ బ్యాంకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి భారీగా అప్పిచ్చి నష్టాల్లో ఉండటం ఇప్పటికే చూశాం. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా అవినీతి రహిత పాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.