ఈ వారం మార్కెట్ అంతంతే!
రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం సెలవు
న్యూఢిల్లీ : ఈ వారం మార్కెట్ను కంపెనీల రిజల్ట్స్, గ్లోబల్ ట్రెండ్స్, విదేశీ ఇన్వెస్ట్మెంట్ల కదలికలు నడిపించనున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం మార్కెట్కు సెలవు. ఈ వారం నాలుగు రోజులే ట్రేడింగ్ జరగనుండగా, జనవరి మంత్లీ ఎఫ్ అండ్ ఓ సిరీస్ ఎక్స్పైరీ బుధవారం ఉండడంతో వోలటాలిటీ ఎక్కువగా ఉంటుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. గ్లోబల్గా వోలటాలిటీ కనిపిస్తోందని, క్లియర్ డైరెక్షన్ లేదని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. కానీ, గ్లోబల్ మార్కెట్లో పెద్ద కదలికలు ఏమైనా ఉంటే మన మార్కెట్పై ఆ ప్రభావం ఉంటుందని చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల సెల్లింగ్ నెమ్మదించిందని, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల ఫ్లోస్ మార్కెట్ డైరెక్షన్ను నిర్ణయిస్తాయని అన్నారు. క్యూ3 రిజల్ట్స్ సీజన్ కొనసాగుతుండడంతో నిర్ధిష్టమైన షేర్లు ఎక్కువగా కదిలే అవకాశం ఉందని వివరించారు.
ఈ వారం యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ, బజాజ్ ఆటో, డీఎల్ఎఫ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, వేదాంత కంపెనీలు తమ రిజల్ట్స్ను ప్రకటించనున్నాయి. ‘మార్కెట్ కన్సాలిడేట్ రేంజ్లోనే కదిలే అవకాశాలు ఉన్నాయి. క్యూ3 రిజల్ట్స్, బడ్జెట్ ఉండడంతో నిర్ధిష్టమైన షేర్లు ఎక్కువగా కదలొచ్చు’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్ధార్ధ్ ఖేమ్కా అన్నారు. విదేశీ ఇన్వెస్టర్ల మూవ్మెంట్స్ను, డాలర్ మారకంలో రూపాయి, బ్రెంట్ క్రూడాయిల్ కదలికలను ట్రేడర్లు గమనించాలని చెప్పారు.