పుంజుకున్న ఎయిర్టెల్ యూజర్ల బేస్
అయినా జియోనే నెంబర్ వన్
పోటీలో వెనకబడ్డ వొడాఫోన్ ఐడియా
బిజినెస్డెస్క్, వెలుగు: వొడాఫోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియోకు మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. కొత్త యూజర్లను ఆకర్షించడంలో ఎయిర్టెల్తో పోలిస్తే జియో ముందంజలో ఉందనే చెప్పాలి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో జియో నెట్వర్క్కు 1.75 కోట్ల మంది కొత్త యూజర్లు యాడ్ అవ్వగా, ఎయిర్టెల్కు మాత్రం కేవలం 6.3 లక్షల మంది కొత్త యూజర్లు మాత్రమే యాడ్ అయ్యారు. జూన్ క్వార్టర్లో ఎయిర్టెల్ నెట్వర్క్ నుంచి 38 లక్షల మంది యూజర్లు బయటకు వెళ్లిపోగా, ఈ క్వార్టర్లో జియో మరో 1.08 కోట్ల మంది యూజర్లను తన నెట్వర్క్కు యాడ్ చేసుకోగలిగింది. కానీ గత మూడు నెలల నుంచి చూస్తే జియోకి ఎయిర్టెల్కి మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతోందని ఎనలిస్టులు అంటున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో జియో నెట్వర్క్కు యాడ్ అయిన కస్టమర్ల(73 లక్షలు) కంటే ఎయిర్టెల్కు యాడ్ అయిన కస్టమర్లు(1.39 కోట్లు) రెండింతలున్నారు. గత కొన్ని నెలల నుంచి జియోని ఎయిర్టెల్ అధిగమిస్తోందని బీఎన్పీ పారిబా ఇండియా ఎనలిస్ట్ కునాల్ వోరా అన్నారు. గత రెండేళ్లలో ఈ కంపెనీ కొత్తగా 30 వేల ప్లేస్లకు విస్తరించిందని, 1.9 లక్షల 4జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని అన్నారు. ఇండస్ట్రీలో ఎయిర్టెల్కు ఆర్పూ ఎక్కువగా వస్తోందని, గత కొన్ని నెలల నుంచి కంపెనీ 4జీ, పోస్ట్పెయిడ్ సెగ్మెంట్కు కొత్త కస్టమర్లు యాడ్ అవుతున్నారని పేర్కొన్నారు. 4జీ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎయిర్టెల్, జియోలతో పోలిస్తే వొడాఫోన్ ఐడియా బలహీనంగా ఉంది. ఒక్క సెప్టెంబర్లోనే 46 లక్షల మంది యూజర్లను ఈ నెట్వర్క్ కోల్పోయింది.
యావరేజ్ రెవెన్యూపై ఫోకస్..
నెట్వర్క్ కంపెనీలు కొత్త యూజర్లను యాడ్ చేసుకోవడంపై కంటే తమ యావరేజి రెవెన్యూ పెర్ యూజర్(ఆర్పూ) ని పెంచుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఆర్పూ పరంగా జనవరి–మార్చి పిరియడ్లో జియో కంటే ఎయిర్టెల్ ముందంజలో ఉండగా, మే తర్వాత నుంచి ఎయిర్టెల్ కొద్దిగా వెనకబడిందని రెగ్యులేటరీ డేటా చెబుతోంది. సెప్టెంబర్ నాటికి ఎయిర్టెల్ ఆర్పూ రూ. 165 గా ఉంది. యాక్టివ్ యూజర్ల పరంగా సెప్టెంబర్లో 33.2 శాతంతో జియో మొదటి ప్లేస్లో ఉంది. ఈ నెట్వర్క్ను 31.8 కోట్ల మంది యూజర్లు వాడుతున్నారు. 33 శాతం వాటాతో ఎయిర్టెల్ సెకెండ్ ప్లేస్లో ఉండగా, ఈ నెట్వర్క్ను 31.6 కోట్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ఈ రెండు టెలికాం నెట్వర్క్ల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. కానీ ఎయిర్టెల్ యూజర్లలో 97 శాతం మంది యాక్టివ్గా ఉండగా, జియో యూజర్లలో 79 శాతం మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారని ట్రాయ్ డేటా చెబుతోంది.
28శాతం పెరిగిన ఎయిర్టెల్ షేరు..
కంపెనీ సబ్స్క్రయిబర్ల బేస్ పెరుగుతుండడం, సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు బాగుండడంతో ఎయిర్టెల్ షేరు గత కొన్ని సెషన్ల నుంచి భారీగా పెరుగుతోంది. గత రెండు నెలల్లో ఈ కంపెనీ షేరు 28 శాతం పెరిగింది. మరో 42 శాతం పెరుగుతుందని బ్రోకరేజి కంపెనీ సీఎల్ఎస్ఏ అంచనావేస్తోంది. కంపెనీ షేరు ప్రస్తుతం రూ. 505 వద్ద ట్రేడవుతుండగా, రూ. 715 వరకు పెరుగుతుందని తెలిపింది. మోతిలాల్ ఓస్వాల్ కూడా కంపెనీ టార్గెట్ ధరను రూ. 650 గా నిర్ణయించింది. యాక్సిస్ సెక్యూరిటీస్ ఈ షేరు టార్గెట్ ధరను రూ. 657 గా లెక్కించింది.