
- ఈ ఒక్క ఎంపీ సెగ్మెంట్లోనే పార్టీకి గెలుపు అవకాశాలు!
- టికెట్ రేసులో ఎక్కువ మంది లీడర్లు
- తెరపైకి ఎమ్మెల్సీ కవిత పేరు
- ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు
మెదక్, వెలుగు : మెదక్ ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్లో తీవ్ర పోటీ కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లను, ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి రాష్ట్రంలో ఈ ఒక్క లోక్సభసెగ్మెంట్ పరిధిలోనే బీఆర్ఎస్కు గెలుపు అవకాశాలు ఉండడంతో ఆ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో దానిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. వీరిలో తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని లీడర్లు కూడా ఉన్నారు. కానీ, ప్రస్తుతం ఎమ్మెల్సీలు కవి త, వెంకట్రామిరెడ్డి పేర్లు తెరపైకి రావడం, ఆ వెంటనే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డిని కలవడం హాట్టాపిక్గా మారింది.
కేసీఆర్ ఫ్యామిలీలోనే భిన్నాభిప్రాయాలు
మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుచోట్ల బీఆర్ఎస్ గెలిచింది. మెదక్లో కాంగ్రెస్ నుంచి మైనంపల్లి రోహిత్ విజయం సాధించగా.. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. పోలైన ఓట్లలో బీఆర్ఎస్కు 6,59,183 ఓట్లు రాగా.. కాంగ్రెస్ పార్టీకి 4,17,976 ఓట్లు దక్కాయి. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ 2 లక్షల 41 వేల 204 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. కేసీఆర్, హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు భారీ మెజారిటీ రావడంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటును ఈజీగా గెలుస్తామన్న ధీమాతో పలువురు బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.
అందుకే అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డిని కాదని బీఆర్ఎస్ హైకమాండ్ సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అలకబూనిన మదన్రెడ్డిని బుజ్జగించేందుకు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని అప్పట్లో గులాబీ పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. దీంతో టికెట్పై మదన్రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ గాలి అనిల్కుమార్ ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా బీఆర్ఎస్ హైకమాండ్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మెదక్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన పద్మాదేవేందర్ రెడ్డి సైతం ఎంపీ టికెట్ఆశిస్తున్నట్టు ఆమె అనుచరులు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ కూడా తనకు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ను కోరారు. వీళ్లంతా టికెట్రేసులో ఉండగానే ఎమ్మెల్సీలు కవిత, వెంకట్రామిరెడ్డి పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ లీడర్కు మాజీ మంత్రి హరీశ్రావు మద్దతు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
కలకలం రేపుతున్న భేటీ
ఓవైపు మెదక్ ఎంపీ టికెట్కోసం బీఆర్ఎస్లో పోటాపోటీ నెలకొనగా.. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డిని కలవడం గులాబీ పార్టీలో కలకలం రేపుతున్నది. సీఎంను కలిసిన నలుగురు ఎమ్మెల్యేల్లో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని వారే కావడం గమనార్హం. ప్రొటోకాల్, ప్రొటెక్షన్ అంశాలపైనే సీఎంను కలిశామని ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. బీఆర్ఎస్ కేడర్లోకి అది ఇంకోరకంగా వెళ్లిపోయింది. మెదక్లో కవిత ఎంట్రీని అడ్డుకునేందుకే పార్టీలో తెరవెనుక రాజకీయాలు మొదలయ్యాయనే చర్చ జరుగుతున్నది.