
- పాలేరు సెగ్మెంట్పై పొంగులేటి, నాగేశ్వరరావు ఆసక్తి
- ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న పలువురు నేతలు
- రాయల నాగేశ్వరరావు వర్గం అసమ్మతి సమావేశం
- ఇన్నేళ్లు పార్టీకి అండగా ఉన్నవారికి టికెట్ ఇవ్వాలని సూచన
ఖమ్మం, వెలుగు : రాష్ట్ర రాజకీయాల్లో కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫుల్ స్టాప్ పెట్టారు. బీఆర్ఎస్ కు శనివారం ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ గా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అయితే, ఇన్నేళ్లు పార్టీని నమ్ముకొని, ఆయా సెగ్మెంట్లలో పోటీ చేయాలనుకుంటున్న నేతల్లో మాత్రం కొంత ఆందోళన కనిపిస్తోంది. తమకు దక్కాల్సిన సీటును చివరి క్షణాల్లో వేరే వాళ్లు తన్నుకుపోతున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్య నేతల రాకను స్వాగతిస్తూనే, తమకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీదేనని వారు చెబుతున్నారు. మరోవైపు గతం నుంచి పనిచేసుకుంటున్న నేతలు, కొత్తగా చేరిన వాళ్లలో ఎవరికి, ఏ టికెట్ దక్కుతుందన్న చర్చ పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని జనరల్ సీట్లలో ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి నెలకొంది. పాలేరు సెగ్మెంట్ పై తుమ్మల, పొంగులేటి ఇద్దరూ ఆసక్తి చూపుతున్నారు.
పోయిన చోటనే వెతుక్కోవాలంటున్న తుమ్మల
తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో తుమ్మల నాగేశ్వరరావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచారు. మరో మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కొద్ది నెలల్లోనే కందాల టీఆర్ఎస్లో చేరడం, ఆయనకే పార్టీ బాధ్యతలు అప్పగించడంతో తుమ్మల సైలెంటయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య పోరు ఉన్నా.. కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తనకు మళ్లీ అవకాశం వస్తుందని తుమ్మల భావించారు.
Also Raed:అనుమానాలు నివృత్తి చేయాల్సిన ..బాధ్యత ఆఫీసర్లదే..
నాలుగేళ్లలో ఎమ్మెల్సీ చాన్స్, రాజ్యసభ సీటు అంటూ రకరకాల ప్రచారాలు జరిగినా.. అవి కార్యరూపం దాల్చలేదు. మళ్లీ పాలేరు నుంచి బరిలోకి దిగాలని తుమ్మల భావించినా.. సిట్టింగ్కే ఆ సీటు కేటాయించి తుమ్మలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. పాలేరులో ఓటమితో పోయిన పరువును, మళ్లీ అక్కడే పోటీ చేసి కందాలపై గెలవాలని తుమ్మల పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకూ సిద్ధమని ఆయన చెప్పుకొచ్చారు. చివరకు కాంగ్రెస్ లో చేరడంతో ఆయన పంతం నెగ్గుతుందా, అసలు పాలేరు సీటు తుమ్మలకు దక్కుతుందా లేక వేరెవరికైనా ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. తుమ్మల మాత్రం తనకు మరో ఆప్షన్ ఏదీ వద్దు, పాలేరు సీటు మాత్రమే కావాలని కోరుకుంటున్నారని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు.
క్యాస్ట్ ఈక్వేషన్లపై కాంగ్రెస్ ఫోకస్
ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించగా, ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్, పాలేరు నుంచి కందాల ఉపేందర్ రెడ్డి మళ్లీ పోటీ చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అదే సామాజికవర్గాలకు చెందిన వారినే అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా తమకు కలిసి వస్తుందనే భావనలో కాంగ్రెస్ ఉంది. ఈ సమీకరణలోనే పాలేరు నుంచి పొంగులేటిని, ఖమ్మం నుంచి తుమ్మలను పోటీచేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పొంగులేటి దీనికి సుముఖంగా ఉన్నా, తుమ్మల మాత్రం తన మాటకే కట్టుబడి ఉన్నారు. అయితే ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక అంశంపై చర్చ లేదని, పార్లమెంట్ సమావేశాల తర్వాత, కమ్యూనిస్టుల పొత్తులు, సీట్లపై క్లారిటీ వచ్చిన తర్వాత ఏయే సీటు నుంచి ఎవరనేది నిర్ణయిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్న నేతలు.. తమ సీట్లకు ఇతరుల వల్ల గండిపడే అవకాశం ఉండడంతో కొంత ఆవేదన చెందుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారికి అవకాశాలు ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి చేరిన వారికి చాన్స్ ఇవ్వడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఇతరుల చేరికతో పార్టీ బలోపేతం అవుతున్నా, తమలాంటి నేతలకు అన్యాయం జరగకుండా పార్టీ చూసుకోవాలని అంటున్నారు. ముదిగొండలో శనివారం రాయల నాగేశ్వరరావు వర్గం నేతలు సమావేశం కాగా, అక్కడ అవే డిమాండ్లు వినిపించాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి పార్టీ గెలుపు కోసం రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసిన రాయలకు పాలేరు సీటు ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. తుమ్మల రాకను స్వాగతిస్తున్నామని అంటూనే, తమ అసమ్మతిని వారు బయటపెట్టారు.
సస్పెన్స్ కు తెరదించిన తుమ్మల
గత నెల 21న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి పాలేరు టికెట్ తనకు దక్కకపోవడంతో పార్టీపై తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పైకి ఒక్క మాట కూడా అనకుండానే బీఆర్ఎస్ జెండాలు, కేసీఆర్ ఫోటోలు లేకుండా భారీ కార్ల ర్యాలీ నిర్వహించి పార్టీ మార్పుపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాణిక్ రావు ఠాక్రే, రేవంత్, పొంగులేటి వంటి ముఖ్యులు వేర్వేరుగా తుమ్మల ఇంటికి వెళ్లి తమ పార్టీలోకి రావాలని ఆయనను కోరారు. తుమల తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పాలేరు సీటుపై ఆయన పట్టుబట్టడం, అదే సీటుపై పొంగులేటి కూడా ఆసక్తి చూపడంతో ఒక దశలో ఆయన కాంగ్రెస్ లో చేరతారా, లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా అన్న చర్చ కూడా మొదలైంది. రేవంత్ సహా కాంగ్రెస్ నేతల చొరవతో ఆ పరిస్థితి రాకుండానే తుమ్మల.. కాంగ్రెస్ లో తన చేరికను కన్ఫమ్ చేశారు. అయితే, ఇప్పటికీ తుమ్మల ఏ సీటు నుంచి పోటీ చేస్తారు, పొంగులేటి ఎక్కడి నుంచి బరిలో దిగుతారో నిర్ణయం తీసుకోలేదని, దానికి మరికొంత టైమ్ పడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.