
యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : సింగరేణి ఆర్జీ 2 ఏరియాలోని జీడీకే 7 ఎల్ఈపీ మైన్, రెస్క్యూ స్టేషన్ లో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే సమయంలో ఎదురయ్యే అవాంతరాలను ఎదుర్కోవడం, పీపీఈ కిట్ ధరించి పుల్ అప్ చేయడం, ఆరు కిలోల అగ్నిమాపక పరికరాలను 15 మీటర్ల వరకు తీసుకెళ్లడం, 30 కిలోల చొప్పున ఉన్న ఐదు చెక్క దుంగలను 1.2 మీటర్ల ఎత్తులో ఉన్న గోడపై నుంచి బయటకు వేయడం, ర్యాంప్ నుంచి అగ్నిప్రమాదం జరిగిన స్థలంపైకి టర్బో జెట్ నాజిల్ను తీసుకెళ్లి ఫైర్ ఫైటింగ్ చేయడం వంటి పోటీల్లో బ్రిగేడియర్లు తమ ప్రతిభ కనపరిచారు.
ఈ టాస్క్ ను పురుషులతో సమానంగా మహిళా టీమ్ సభ్యులు కూడా పూర్తి చేయడం విశేషం. రెస్క్యూ రిలే పోటీలు డీఎంఎస్, డీడీఎంఎస్, ఏడీఎంఎస్ న్యాయనిర్ణేతల పర్యవేక్షణలో జరగగా ఈ పోటీలను చీఫ్ జడ్జి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ధన్బాద్) శ్యామ్ మిశ్రా స్వయంగా పరిశీలించారు. కార్పొరేట్ సేఫ్టీ జీఎం గురువయ్య, ఏరియా జనరల్ మేనేజర్ ఎల్.వి.సూర్యనారాయణ, రీజియన్ సేఫ్టీ జీఎం ఎస్.సాంబయ్య, రెస్క్యూ జీఎం ఎస్.వెంకటేశ్వర్లు, ఎస్ఓటు జీఎం అబ్దుల్ సలీం, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావు తదితరులు ఈ పోటీలను తిలకించారు.