ఓటేయాలంటే.. 8 కిలోమీటర్లు నడవాల్సిందే

ఓటేయాలంటే.. 8 కిలోమీటర్లు నడవాల్సిందే
  • భద్రాద్రికొత్తగూడెం ఏజెన్సీ గ్రామాల్లో ఓటర్ల అవస్థలు 
  • పోలింగ్​ కేంద్రంలోనూ కనీస సౌకర్యాలు కరువు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పలు మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని ఓటర్లకు ఓటు వేసేందుకు తిప్పలు తప్పడం లేదు. ఓటేయాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యధికంగా పోలింగ్​ అయ్యేలా ఎన్నికల సంఘం ఓ వైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో ప్రత్యేకంగా పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. కనీసం పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేసిన చోటైనా  సరైన సౌకర్యాలు లేని పరిస్థితి నెలకొంది. 

మారుమూల ప్రాంతాలే ఎక్కువ.. 

జిల్లాలో అత్యధికం ఏజెన్సీ ప్రాంతం. ఇందులో ఎక్కువగా మారుమూల అటవీ ప్రాంతాలే. గుంపులు గుంపులుగా, గూడాలుగా మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని కొన్ని హ్యాబిటేషన్స్​కు కలిపి పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లకు దూరాభారం తప్పడం లేదు. 

  •     ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు గ్రామపంచాయతీలో ఏడు గ్రామాలున్నాయి. దాదాపు 670 మంది ఓటర్లున్నారు. వీరంతా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని రాజీవ్​ నగర్​ గ్రామంలోని గవర్నమెంట్​ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రానికి వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడ్తున్న వారు, దివ్యాంగులు అంత దూరం వెళ్లేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది.  గుండాలపాడు గ్రామపంచాయతీ ఆఫీస్​లో పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేస్తే సగానికి పైగా దూరం తగ్గుతుందని  స్థానికులు చెబుతున్నారు. 
  •     ముల్కలపల్లి మండలంలోని రెడ్డిపల్లి, మంగళగుట్ట, సుందర్​నగర్​ గ్రామాల్లో దాదాపు 788 మంది ఓటర్లున్నారు. వీరంతా దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. 
  •     అశ్వారావుపేట మండలం మొద్దులమాడ గ్రామపంచాయతీలోని పెద్దమిద్దె గ్రామంలో 70గొత్తికోయల ఓట్లున్నాయి. వీరంతా ఏడు కిలోమీటర్ల దూరంలో గల దురదపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రానికి కాలినడకన వెళ్లి ఓటు వేయాల్సిందే. సరైన రోడ్డు మార్గం లేదు. వర్షం వస్తే వాగులను దాటుకుంటూ వెళ్లాల్సిందే. 
  •     గంగారం గ్రామంలో దాదాపు 270ఓటర్లు ఉన్నారు. వీరంతా నాలుగు కిలోమీటర్ల దూరం నడక సాగించి వాగొడ్డు గూడెంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రానికి రావాలి. 
  •     వేదాంతపురంలో దాదాపు 330 మంది ఓటర్లున్నారు. వీరు కూడా వాగొడ్డు గ్రామంలోని పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటు వేయాల్సిందే. 
  •     అన్నపురెడ్డిపల్లి మండలంలోని మహబూబ్​నగర్​ పోలింగ్​ స్టేషన్​లో టాయ్​లెట్​ సౌకర్యం లేకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 
  •     చండ్రుగొండ మండలం సామ్యాతండా పోలింగ్​ కేంద్రంలో టాయ్​లెట్​, తాగునీటి సౌకర్యాలు లేవు. తండాలో దాదాపు 140 మంది ఓటర్లున్నారు. పోలింగ్​ రోజు పోలింగ్​ కేంద్రం ఏర్పాటు చేసిన గవర్నమెంట్​ స్కూల్​ పక్కనే ఉన్న ఇంట్లోని టాయి​లెట్​ వాడుకునేలా సర్పంచ్​ ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. 
  •     గుండాల మండలంలోని కొడవటంచ, నాగారం, పాలగూడెం గ్రామాలకు చెందిన ఓటర్లు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ముత్తాపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి.
  •     వెంకటాపురం, మల్లెల గుంపు గ్రామాలకు చెందిన ఓటర్లు దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చి ఓటు వేయాల్సి ఉంది. 
  •     గలభ గ్రామానికి చెందిన ఓటర్లు ఏడు కిలోమీటర్ల దూరంలో గల గుండాలకు వచ్చి ఓటు వేయాల్సి ఉంది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దాదాపు ఏడు కిలోమీటర్ల దూరం నడిచి ఓటు వేయాల్సి వస్తోందని ఓటర్లు వాపోతున్నారు.