- మూడు వారాలుగా సర్వర్లో సాంకేతిక సమస్య
- సేవలు రిస్టోర్ చేసినా మళ్లీ అవాంతరాలు
- డేటా క్రాష్.. మరోసారి డాక్యుమెంట్లుసమర్పించాలంటున్న నిర్వాహకులు
- డేటా రిట్రీవ్ చేస్తున్నామంటున్న సాంకేతిక నిపుణులు
- ఆందోళనలో దరఖాస్తుదారులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా మీ సేవల్లో గందరగోళం నెలకొంది. మూడు వారాలుగా సర్వర్లలో సాంకేతిక సమస్యలతో పౌరసేవలకు అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు సర్వర్లలో సాంకేతిక సమస్యను అధిగమించి సేవలను పునరుద్ధరించినప్పటికీ.. ఎప్పుడు సర్వర్ పనిచేస్తుందో, ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ధృవీకరణ పత్రాల డౌన్ లోడ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పురపాలక సేవలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంతేకాదు, ‘మీ సేవ’లో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి దరఖాస్తు ఆమోదం పొందినట్లు మెసేజ్ వచ్చినా.. సర్వర్లో సమస్యతో సర్టిఫికెట్ డౌన్లోడ్ కావడం లేదు.
దీంతో తమ దరఖాస్తు ఆన్లైన్ లో ఉందో.. లేదో తెలియక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ మీసేవ స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీఎస్) లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో డేటా క్రాష్ అయ్యిందన్న సమాచారంతో కొందరు మీ సేవ నిర్వాహకులు, దరఖాస్తుదారులు ఆందోళన చెందుతుండగా.. డేటాను రిట్రీవ్ చేస్తున్నామని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,216 మీ సేవ కేంద్రాలు ఉండగా.. 38 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 204 రకాల సేవలు అందుతున్నాయి.
ఆ సేవలు పొందాలంటే తప్పనిసరిగా మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. విద్యా సంస్థల్లో ఇంటర్, డిగ్రీ, పీజీ, నీట్, మెడిసిన్, ఐసెట్తో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు ప్రవేశాలు పొందినవారు స్కాలర్షిప్ల కోసం కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థుల వద్ద ఉన్నత, ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల సమయంలో ఈ ధ్రువీకరణ పత్రాలు ఉండాల్సిందే. ఆన్లైన్లో ఆయా పత్రాల నంబర్లు నమోదు చేస్తే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఈసీ పొందాలంటే మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం తహసీల్దార్ ఆఫీసులో మ్యానువల్గా అందించే తొమ్మిది రకాల సర్టిఫికెట్లను మీసేవలో అందుబాటులోకి తెచ్చారు.
ఆ అప్లికేషన్లు ఎక్కడ?.
మీ సేవల్లో జులై 10 నుంచి ఈ నెల 12వ తేదీ మధ్యలో చేసుకున్న దరఖాస్తులు సర్వర్ సమస్యతో కనిపించడం లేదు. దీంతో కుల, ఆదాయ, నివాస తదిరత సర్టిఫికెట్లకు అప్లికేషన్ పెట్టుకున్నవారు స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీఎస్) లో సాంకేతిక సమస్య తలెత్తిందని, మళ్లీ డ్యాకుమెంట్స్ను తిరిగి అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తే తహసీల్దార్ లాగిన్కు డిస్పోసల్ కోసం వెళ్తాయని మీ సేవ నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తుల వివరాలు క్రాష్ అయినట్లు తెలిసింది. దీంతో మళ్లీ అప్లికేషన్లు సమర్పించాలని దరఖాస్తుదారులకు నిర్వాహుకులు ఫోన్ చేస్తున్నారు. మళ్లీ డాక్యుమెంట్లు సమర్పిస్తే ఎలాంటి ఫీజు లేకుండా అప్లైయ్ చేస్తామని చెబుతున్నారు.
అయినా.. దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవ కేంద్రాలు పట్టణ, నగరాల్లో ఎక్కువగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉన్నారు. పైగా దరఖాస్తుదారులకు మీ సేవలో తలెత్తిన సాంకేతిక సమస్యపై అవగాహన లేదు. ఈ సమాచారం తెలియక వారు మళ్లీ అప్లైయ్ చేసుకునే అవకాశం లేదు. అయితే, డేటా రిట్రీవ్ చేస్తున్నామని సాంకేతిక నిపుణులు చెబుతున్నా.. ఒకవేళ దరఖాస్తు ఆన్లైన్లో లేకపోతే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, డేటా రిట్రీవ్ చేస్తున్నామని, ఆన్లైన్లో కనిపించని దరఖాస్తులు ఏమైనా ఉంటే మళ్లీ అప్లైయ్ చేసుకోవాలని మీ సేవ ఈడీఎంలు సూచిస్తున్నారు. కాగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీ-సేవ కేంద్రాలు దాదాపుగా మూడు వారాలుగా పనిచేయకపోవడం ఇదే తొలిసారి. గతంలో మీ సేవలో అంతరాయం ఏర్పడినా.. 24 గంటల నుంచి 48 గంటలలోపే సమస్యను పరిష్కరించేవారు. తొలిసారిగా 15 రోజులకు పైగా సర్వర్ డౌన్ సమస్యతో ఇబ్బందులు పడ్డామని, ఆదాయం కోల్పోయామని మీ సేవ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
