- అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న బీజేపీ, కాంగ్రెస్
- మల్లురవికి నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వడంతో నందినికి డోర్లు క్లోజ్ ?
- నామా నాగేశ్వరరావు కోసం బీజేపీ ప్రయత్నాలు
- అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్లోనూ అయోమయమే !
ఖమ్మం, వెలుగు : ఖమ్మం లోక్సభ అభ్యర్థులపై మూడు ప్రధాన పార్టీల్లోనూ కన్ఫ్యూజన్ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును బీఆర్ఎస్ తమ క్యాండిడేట్గా ప్రకటించినప్పటికీ ఆయన బీజేపీకి వెళ్తారన్న ప్రచారంతో కేడర్లో అయోమయం నెలకొంది. ఇక తమ పార్టీ అభ్యర్థులపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలో క్లారిటీ రావడం లేదు.
కాంగ్రెస్లో గట్టి పోటీ
కాంగ్రెస్లో ఆశావహుల మధ్య పోటీ కారణంగా ప్రకటన ఆలస్యం అవుతుంటే, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్రావు కోసం బీజేపీ వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం 12 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్మధ్య తీవ్ర పోటీ ఉంది. భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ కేటాయించడంతో నందినికి తలుపులు మూసుకపోయాయనే ప్రచారం జరుగుతోంది.
దీంతో ప్రస్తుతం ప్రసాద్రెడ్డి, యుగంధర్లలో ఎవరో ఒకరికి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంట్ సీటుపైనే హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో గురువారం మీటింగ్ జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నప్పటికీ పార్టీ నిర్ణయాన్ని మాత్రం పెండింగ్పెట్టడంతో కాంగ్రెస్కేడర్లో కన్ఫ్యూజన్నెలకొంది.
బీజేపీలోనూ సస్పెన్సే..
బీజేపీలో కూడా ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్కొనసాగుతోంది. ఎంపీ టికెట్ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రీసెంట్గా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు అదే రోజు బీజేపీలో చేరిన ఇతర పార్టీల నేతలకు ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ కాగా, వెంకట్రావు అభ్యర్థిత్వాన్ని పెండింగ్ పెట్టింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును బీజేపీలోకి రప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ నామా తన కుమారుడి పెళ్లి, రిసెప్షన్ కారణంగా బిజీగా ఉండడంతో, నిర్ణయం పెండింగ్లో పడిందని చెప్తున్నారు.
మరోవైపు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండగా, తెలంగాణలో కూడా అదే పొత్తు కంటిన్యూ చేస్తారని, నామా ఒకవేళ బీజేపీలోకి వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపించకపోతే, పొత్తులో భాగంగా టీడీపీ తరఫున బరిలో ఉంటారని సోషల్ మీడియాతో విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో టికెట్ ఆశిస్తున్న వారు ఆరుగురున్నారు. వారిలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కొండపల్లి శ్రీధర్రెడ్డి, ఏబీవీపీ కార్యకర్త స్థాయి నుంచి, బీజేవైఎం, బీజేపీలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు నిర్వర్తించారు. పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.
ఇప్పుడు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. మరో ఆశావహుడు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు వీహెచ్పీలో పనిచేస్తున్నారు. ఇలా పలువురు ఆశావహులు పోటీలో ఉండగా, బలమైన అభ్యర్థి వేటలో ఉన్న బీజేపీ మాత్రం ఇతర పార్టీల నుంచి చేరికలపైనే ఆశలు పెట్టుకుంది. అందుకే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జలగం వెంకట్రావును చేర్చుకుంది. ఇప్పుడు కూడా మరో బలమైన అభ్యర్థి రాకకోసం ప్రయత్నాలు చేస్తున్నందునే బీజేపీ ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్లోనూ అదే సీన్
ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావును ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని పార్టీ నేతలతో చర్చించిన తర్వాత కేసీఆర్నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దిరోజులుగా నామా తన కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో నామా బీజేపీలో చేరబోతున్నారని సోషల్మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దాదాపు రెండు వారాల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తున్నా ఇంతవరకూ నామా నాగేశ్వరరావు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకపోవడంతో ఆయన అనుచరులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు.
బీజేపీలోని ఇతర ఆశావహులు కూడా తమ పరిస్థితేంటని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీలో చేరిన వెంకట్రావు కూడా రెండ్రోజుల క్రితం హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్కు వెళ్లి పార్టీ ముఖ్యులతో మాట్లాడారు. టికెట్ విషయంపై క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్అభ్యర్థి ఎవరో ప్రకటించిన తర్వాతే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.